మేడ్చల్, ఆగస్టు30 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ చీరెల పంపిణీకి ఏర్పాట్లు చేయాలని మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ హరీశ్ అధికారులను ఆదేశించారు. మేడ్చల్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డితో కలిసి బతుకమ్మ చీరెలను విడుదలజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాకు సంబంధించిన గ్రేటర్ పరిధిలోని సర్కిళ్లు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలలో పంపిణీ ఏర్పాట్లు చేయాలన్నారు. మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలకు సంబంధించి 7,04,669 మంది లబ్ధిదారులకు బతుకమ్మ చీరెలను అందించనున్నట్లు కలెక్టర్ వివరించారు. జిల్లాకు ఇప్పటి వరకు రెండు లక్షల బతుకమ్మ చీరెలు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి పద్మజా రాణి పాల్గొన్నారు.