ఘట్కేసర్, అక్టోబర్ 21 : పోచారం మున్సిపాలిటీ నారపల్లి వద్ద నెలకొన్న వరద నీటి నివారణకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నట్లు అధికారులు, ప్రజా ప్రతినిధులు తెలిపారు. పోచారం మున్సిపాలిటీ నారపల్లి వరద నీటి కాలువను గురువారం జిల్లా అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్, జడ్పీచైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి, ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, పోచారం చైర్మన్ కొండల్రెడ్డి, కమిషనర్ ఏ.సురేశ్ పరిశీలించారు. వర్షాలు కురిసిన సమయంలో నారపల్లి అటవీ ప్రాంతం నుంచి వరద నీరు పెద్ద ఎత్తున నారపల్లిలోని వరంగల్ రోడ్డు మీదుగా, దిగువన ఉన్న వివిధ కాలనీలకు వచ్చి చేరుతున్నదని, దీంతో కాలనీల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ విషయాన్ని స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు అధికారులు, మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని నిర్ణయించడంతో ఇరిగేషన్, మండల పరిషత్, పంచాయతీ, మున్సిపాలిటీ అధికారులు పరిశీలించారు. పై నుంచి వచ్చే వరద నీటిని పెద్ద పైపులైన్ ద్వారా మూసీనదిలో కలిపేందుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సందర్భంగా నిర్ణయించారు. ఇందుకు అయ్యే నిధులను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు జిల్లా పరిషత్, మున్సిపాలిటీ మండల పరిషత్ నిధులతో పాటు ప్రభుత్వ నిధులను కూడా ఉపయోగించాలని నిర్ణయించారు.
ఘట్కేసర్ రూరల్ : వరదనీటి ముప్పును నివారించేందుకు నాలాలకు మరమ్మతులు చేపడుతామని మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ జాన్ శ్యాంసన్ తెలిపారు. చౌదరిగూడ పంచాయతీలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన స్వర్ణపురి కాలనీ, అరుంధతీ కాలనీలను గురువారం జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, ఎంపీపీ సుదర్శన్ రెడ్డిలతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో చౌదరిగూడ సర్పంచ్ రమాదేవి, వెంకటాపూర్ సర్పంచ్ గీతా శ్రీనివాస్ ముదిరాజ్, ఎంపీటీసీ రామారావు, అధికారులు పాల్గొన్నారు.