మహబూబాబాద్, ఏప్రిల్ 11 : చదువుతోనే జీవితంలో మార్పు సాధ్యమని జిల్లా కలెక్టర్ కె. శశాంక అన్నారు. సోమవారం స్థానిక ఐ.ఎం.ఎ. హాలులో మహాత్మా జ్యోతిబా పూలే 196 వ జయంతి ఉత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి పూలే చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..1827 సంవత్సరంలో జ్యోతిబా పూలే జన్మించారని, 1800 శతాబ్దంలో జన్మించిన వ్యక్తిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే వారు చేసిన కార్యక్రమాలు, కృషిని, స్ఫూర్తి ఎంత గొప్పవో ఆలోచించాలన్నారు. ప్రతి ఒక్కరు వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని స్ఫూర్తి పొంది అభివృద్ధి సాధించాలని తెలిపారు.
ఆ మహనీయుని స్ఫూర్తిని కొనసాగించుటకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఆడపిల్లలు చదవాలని ఆనాడే సంకల్పించి విద్య ప్రాముఖ్యతను చాటి చెప్పిన దంపతులు అని ప్రశంసించారు.బాలికల కోసం పాఠశాలను ప్రారంభించారని, వితంతు పునర్వివాహ గురించి పూలే ప్రజల్లో చైతన్యం కలిగించి వివాహాలు జరిపించారని, బాధ్యత ఉన్న పౌరుడిగా సామాజిక చైతన్యం తీసుకురావడానికి కృషి చేసిన మహనీయులు అని తెలిపారు. వారు చేసిన కృషిని మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని తెలిపారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, జిల్లా వెనకబడిన తరగతుల అభివృధి అధికారి ఎం.నరసింహ స్వామి, వెనకబడిన తరగతుల సంక్షేమ నాయకులు వేణు, సంచార జాతుల, దళిత, గిరిజన, మైనార్టీ కులాలకు చెందిన ప్రతినిధులు, జిల్లా అధికారులు, జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.