మేడ్చల్, జూన్ 26 (నమస్తే తెలంగాణ):మేడ్చల్ జిల్లాలో మరో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కానుంది. పార్కుకు కావాల్సిన భూమిని ఇచ్చేందుకు రైతులు అంగీకరించారు. మేడ్చల్ జిల్లాలోని ఘట్కేసర్ మండలం మాదారంలోని 300ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నట్లు టీఎస్ఐఐసీ అధికారులు నిర్ధారించిన విషయం విదితమే. 227ఎకరాలకు సంబంధించిన లావుని పట్టాదారులైన 98 మంది రైతులు ప్రభుత్వానికి భూమిని ఇచ్చేందుకు అంగీకరించడంతో నష్టపరిహార చెల్లింపులపై అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
రైతులకు నష్టపరిహారం చెల్లింపులు పూర్తయిన వెంటనే ప్రభుత్వం భూములను స్వాధీనం చేసుకుని టీఎస్ఐఐసీ అధికారులకు అప్పగించనుంది. మరో 73 ఎకరాల ప్రభుత్వ భూమిని పార్కు కోసం కేటాయిస్తున్నారు. ఔటర్ రింగ్రోడ్డుకు సమీపంలో ఉన్న మాదారంలో ఏర్పడనున్న ఇండస్ట్రియల్ పార్కుతో నిరుద్యోగ యువతకు ఉపాధి లభించడమే కాకుండా సౌకర్యంగా మారనుంది. భూమిని అప్పగించిన వెంటనే పార్కులో పరిశ్రమల ఏర్పాటు పక్రియ ముందుకు సాగనుంది. రైతులకు పరిహారం చెల్లింపులపై సప్రందింపుల కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు మేడ్చల్ జిల్లా ఇన్చార్జి డీఆర్వో లింగ్యానాయక్ తెలిపారు.
నగరానికి సమీపంలో ఉన్న మేడ్చల్ జిల్లా పారిశ్రామిక రంగంలో రాష్ట్రంలో నంబర్వన్ స్థానంలో ఉంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఉన్న 7,990 పరిశ్రమల్లో సుమారు 1,92,550 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.