గులాబీ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి
ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
అచ్చంపేట రూరల్, ఏప్రిల్ 25: టీఆర్ఎస్తోనే ప్రజా సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం అచ్చంపేట 8, 18వ వార్డుల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ 24గంటల విద్యుత్, మిషన్ కాకతీయ, భగీరథ, రైతుబంధు, బీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, విద్యార్థులకు సన్న బియ్యం, గురుకులాల్లో నాణ్యమైన విద్య తదితర సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల్లో 20వార్డుల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీకి 2014కు ముందు అభివృద్ధి గుర్తుకు రాలేదా అని, ఇప్పుడు స్థాయికి మించిన హామీలు ఇవ్వడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. అచ్చంపేట ప్రాంతంలోని మల్లెలతీర్థం, అక్కమహాదేవి గుహలు, ఉమామహేశ్వరం తదితర ప్రాంతాలను రూ.60కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు గుర్తు చేశారు. అచ్చంపేట అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే 30న జరుగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు టీఆర్ఎస్లో చేరారు. అనంతరం 16వ వార్డులో ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ తులసీరాం, అభ్యర్థులు గోపిశెట్టి శివ, సృజన హుస్సేన్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.