కుత్బుల్లాపూర్,మార్చి12: కుత్బుల్లాపూర్,గాజులరామారం సర్కిళ్ల పరిధిలో పలు వీధులు ఎల్ఈడీ లైట్లతో జిగేలుమంటున్నాయి. సంబంధిత ఎలక్ట్రికల్ విభాగం అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రధాన చౌరస్తాలతో పాటు వీధుల్లోని లైట్లన్నీ ఎల్ఈడీ వెలుగులతో ప్రజలకు మెరుగైన దారులను చూపేందుకు కృషి చేస్తున్నారు. తక్కువ వినియోగంతో పాటు అధికంగా వెలుగులు నింపేందుకు ఎల్ఈడీ స్ట్రీట్లైట్ల కాంతులు చూపరులను అబ్బురపరుస్తున్నాయి.
కుత్బుల్లాపూర్ జంట సర్కిళ్ల పరిధిలో మొత్తం 71, 422 వీధిలైట్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. వీటిలో కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో 13422 వీధిలైట్లు ఉండగా, గాజులరామారం సర్కిల్ పరిధిలో 13339 వీధిలైట్లను ఏర్పాటు చేశారు. గతంలో ఎస్వీల్యాంప్స్ ఉన్నప్రాంతాల్లో పూర్తిగా వాటిని తొలగించి ప్రత్యేకంగా ఎల్ఈడీ బల్బులతో కూడిన వీధిలైట్లను ఏర్పాటు చేశారు. సుమారు 400వాట్స్ బల్బులు గతంలో వాడడంతో విద్యుత్ వాడకం అధికంగా అయ్యేది. దీంతో వాటి స్థానంలో ఇప్పుడు ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేసి అతి తక్కువ ఖర్చుతో సేవింగ్ పవర్ ద్వారా విద్యుత్ కాంతులు వెలిగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రధాన చౌరస్తాలు…ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న ప్రాంతాల్లో ఎల్ఈడీ హైమాస్ట్తో పాటు ఆకర్శించే డెకరేట్ లైట్లను ఏర్పాటు చేశారు.
జంట సర్కిళ్ల పరిధిలో ప్రధాన రహదారులతో పాటు వీధుల్లో సైతం ఎక్కడైనా వీధిలైట్లు వెలగకపోయితే ప్రజలు నేరుగా స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఫిర్యాదు లేదా 155304 టోల్ఫ్రీ నంబర్కు నేరుగా ఫోన్ చేసి ఏరియా పేరు చెబితే చాలు అక్కడ సంబంధిత సిబ్బంది వాలి వెనువెంటనే సమస్యను పరిష్కరిస్తున్నారు. దీనికి తోడు కొత్తగా విద్యుత్ స్తంబం కావాల్సి వచ్చినా ఇదే నంబర్కు ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు.
తక్కువ విద్యుత్ను వినియోగించి అధికంగా వెలుగులు నిం పేందుకు ఎల్ఈడీ స్ట్రీట్లైట్లు వెలిగించుకోవడానికి అవకాశం ఉంది. గతంలో కంటే ఎల్ఈడీ వచ్చాక ప్రజలు పూర్తిస్థాయిలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ప్రధాన రహదారులపై ఎల్ఈడీ లైట్ల కాంతులతో వాహనదారులకు, పాదచారులకు అనుగుణంగా లైట్ల ను ఏర్పాటు చేశాం. ఎలాంటి ఫిర్యాదు ఉన్నా టోల్ఫ్రీ నంబర్ ద్వారా తెలుపవచ్చు. – రఘుపతిరెడ్డి, డీఈ ఎలక్ట్రికల్ విభాగం కూకట్పల్లి సర్కిల్