శామీర్పేట-బూరుగు చెరువు మధ్య కాలువ నిర్మాణానికి 16.05 ఎకరాల సేకరణ
శామీర్పేట గ్రామ పంచాయతీలో రైతులకు అవగాహన
మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి
శామీర్పేట, మే 18 : తెలంగాణ ప్రభుత్వం మంచినీరు, సాగునీటిని అందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా శామీర్పేట మండల కేంద్రంలో మంగళవారం ఆయన పర్యటించి.. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కాలువల నిర్మాణం, భూ సేకరణ పనులపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొండపోచమ్మ వరకు…అక్కడ నుంచి మేడ్చల్, శామీర్పేట మండలాలకు కాలువల ద్వారా నీటిని తీసుకువచ్చి చెరువులు, కుంటలు నింపడానికి కృషి చేస్తున్నామని వివరించారు. రావల్కోల్ ఎడమ కాలువ నుంచి శామీర్పేట పెద్ద చెరువుకు.. అక్కడి నుంచి కాలువ ద్వారా బూరుగు చెరువులోకి నీటిని తరలించనున్నట్లు తెలిపారు. ఇందుకు శామీర్పేట పెద్ద చెరువు నుంచి బూరుగు చెరువు వరకు కాలువ నిర్మాణం కోసం శామీర్పేట రైతులు సుమారు 16.05 ఎకరాల భూమిని అందించాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్ తరాల కోసం చేపట్టే ఈ భూ సేకరణకు రైతులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీవో రవి, ఎంపీపీ ఎల్లుబాయిబాబు, ఎంపీటీసీ సాయిబాబు, తహసీల్దార్ సురేందర్, ఉపసర్పంచ్ రమేశ్యాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుదర్శన్, మాజీ సర్పంచ్ కిశోర్యాదవ్, వార్డు సభ్యులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.