దుండిగల్, ఆగస్టు 15: వనపర్తి జిల్లా, కొత్తకోట మండలం, పాంకుంట గ్రామానికి చెందిన బోయ తిరుపతయ్య, సుంతానమ్మ దంపతులకు శ్రీకాంత్(21), చందు సంతానం. తిరుపతయ్య మరణించడంతో కూలీనాలీ చేసి సుంతానమ్మ కొడుకులను పోషించింది. ఉపాధి కోసం ఆమె తన కొడుకులతో కలిసి సంగారెడ్డి జిల్లాలోని ఐడీఏ బొల్లారానికి వలస వచ్చి అక్కడే నివాసముంటున్నది. తల్లితో పాటు కొడుకులిద్దరూ భవన నిర్మాణంలో కూలీలుగా పనిచేస్తున్నారు. ఆదివారం ఉదయం మల్లంపేటలోని ఆకాశ్ లే అవుట్ కాలనీలో నిర్మాణంలో ఉన్న భవనం ఏడో అంతస్తుకు స్లాబ్ వేసే పనులకు వెళ్లారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఏడో అంతస్తుపై పనిచేస్తున్న శ్రీకాంత్ తొట్టిలో కూర్చున్నాడు. అదే సమయంలో నిచ్చెన, తొట్టికి అనుసంధానంగా ఉన్న ఇనుప వైరు తెగిపోయింది. శ్రీకాంత్ కూర్చున్న తొట్టి ఏడో అంతస్తుపై నుంచి కిందపడింది. తెగిపోయిన ఇనుప తీగ అతడి మెడకు గుచ్చుకోవడంతో దుర్మరణం పాలయ్యాడు .రెప్పపాటులో కండ్ల ముందే కొడుకు విగతజీవిగా మారడంతో తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.