మేడ్చల్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): కేశవాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణ పనులు చివరి దశకు చేరాయి. అటవీశాఖ, రెవెన్యూ భూములకు సంబంధించి హద్దుల గుర్తింపు పూర్తయ్యింది. మహానగరానికి తాగు నీటిని అందించే మేడ్చల్ జిల్లా కేశవాపూర్ రిజర్వాయర్ పనులు త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ ఆదేశాల మేరకు భూ సేకరణ పనులను అధికారులు పూర్తి చేస్తున్నారు. 5.04 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ను నిర్మించనున్నారు. ఈ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నగర ప్రజలతో పాటు శివారు మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాలకు తాగు నీరు అందనుంది.
రిజర్వాయర్ నిర్మాణ భూ సేకరణ పనుల్లో భాగంగా అటవీశాఖ భూముల హద్దులను రెవెన్యూ, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా గుర్తించారు. అటవీశాఖ హద్దుల గుర్తింపు పూర్తితో భూ సేకరణ పనులు త్వరలోనే పూర్తి కానున్నాయి. రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమయ్యే 15 వందల ఎకరాలకు గాను వెయ్యి ఎకరాలు అటవీశాఖ కేటాయించింది. మరో ఐదు వందల ఎకరాల్లో 267 లావణి పట్టా, 136 ఎకరాలు ప్రభుత్వ భూమి, 99 ఎకరాలు పట్టా భూములు ఉన్నాయి. ఇందులో పట్టా రైతులకు సంబంధించి 43 ఎకరాలకు పరిహారం చెల్లించగా, మరో 56 ఎకరాలకు సంబంధించిన పరిహారం చెల్లించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. 267 ఎకరాల లావణి పట్టా దారులకు పరిహారం చెల్లింపులపై సంప్రదింపుల కమిటీ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
కేశవాపూర్ రిజర్వాయర్కు ఇచ్చిన వెయ్యి ఎకరాలకు బదులుగా ఇతర జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ భూమిని అటవీశాఖకు బదలాయింపు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిద్దిపేట, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లోని అటవీశాఖ భూమిని బదలాయింపు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులను ఇచ్చినట్లు మేడ్చల్ జిల్లా అటవీశాఖ అధికారి వెంకటేశ్వర్లు వెల్లడించారు. అటవీశాఖకు ఇచ్చే భూమిలో అటవీ విస్తీర్ణాన్ని పెంచనున్నారు.
కేశవాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి అటవీశాఖ ఇచ్చిన భూముల హద్దులను మంగళవారం అధికారులు గుర్తించారు. మేడ్చల్ జిల్లా అటవీశాఖ అధికారి వెంకటేశ్వర్లు, భూ సేకరణ అధికారి, ఇన్చార్జి డీఆర్వో లింగ్యానాయక్, కీసర ఆర్డీవో రవి పర్యవేక్షణ, సమీపంలో భూములు ఉన్న రైతుల సమక్షంలో సర్వేయర్లు హద్దుల గుర్తింపు పనులను పూర్తి చేశారు. త్వరలోనే భూ సేకరణ పనులు పూర్తి కానున్నట్లు అధికారులు తెలిపారు.