మేడ్చల్, రూరల్ 15 : సమర్థవంతమైన బోధనకు సాంకేతిక సహాయం అవసరమని జేఎన్టీయూ ఆచార్యుడు ఎల్.ప్రతాప్రెడ్డి పేర్కొన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఏఐసీటీఈ ఆధ్వర్యంలో అధ్యాపకుల రెండు వారాల శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రస్తుత ఆధునికయుగంలో బోధన మాధ్యమంలో చాలా మార్పులు వచ్చాయన్నారు. విద్యార్థి వికాసానికి నూతన పద్ధతులు అవలంభించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బోధన, పరిశోధనలు ఎలా సమతుల్యం చేయాలో వివరించారు. కళాశాల డైరెక్టర్ రామస్వామిరెడ్డి మాట్లాడుతూ మార్చి 27న శిక్షణ కార్యక్రమం ముగుస్తుందన్నారు. ఈ శిక్షణ ద్వారా పొందిన పరిజ్ఞానాన్ని బోధనలో అమలు చేయాలని అధ్యాపకులకు సూచించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు చెందిన ఉపన్యాసకులు కార్యక్రమంలో పాల్గొని బోధనను కళాత్మకంగా వివరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో హెచ్వోడీలు ఎం.జగదీశ్, చంద్రప్రసాద్, అధ్యాపకులు పాల్గొన్నారు. సమన్వయకర్తలు సుబ్బలక్ష్మి, శ్రీనివాస్రెడ్డి వ్యవహరించారు.