సరిగ్గా నాలుగేండ్ల క్రితం జీడిమెట్ల పారిశ్రామిక వాడను బెంబేలెత్తిస్తున్న రసాయన గోడౌన్లపై హైకోర్టు కన్నెర్ర చేసింది. ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిళ్లడంతో రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రత్యేక దృష్టిసారించింది. రసాయన గోడౌన్లను జనావాసాల నుంచి దూరంగా తరలించాలని హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలో కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ జీడిమెట్ల పారిశ్రామిక వాడను జల్లెడ పట్టింటి. ప్రమాదకరంగా మారిన రసాయన గోడౌన్లను నగర శివారు ప్రాం తానికి తరలించారు. అక్రమంగా నడుస్తున్న గోడౌన్లపై కేసులు నమోదు చేసి సీజ్ చేశారు. దీంతో పారిశ్రామిక వాడ పరిసర ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.అంతటితో అధికారులు చేతులు దులుపుకోవడంతో మళ్లీ పాత స్థితికే చేరుకున్నది. నిత్యం అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ప్రజలు ప్రాణాలను ఆరచేతిలో పెట్టుకుని బిక్కుమంటూ జీవనం సాగించాల్సిన దుస్థితి దాపురించింది. ఇప్పటికైనా అన్ని శాఖ అధికారులు స్పందించి ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
ఏడాది కాలంగా సుమారు 200 పై చిలుకు అక్రమ రసాయన గోడౌన్లు వెలిశాయి. మండుతున్న ఎండల కారణంగా నిత్యం అగ్ని ప్రమాదాలు సంభవిస్తుండటంతో కెమికల్ డ్రమ్ము లు సుమారు 10 నుంచి 15 మీటర్ల వరకు ఎత్తుకు ఎగిరి పేలిపోతున్నాయి. తాజాగా దూలపల్లి రోడ్డులో ఏప్రిల్ 17న ఓకెమికల్ గోడౌన్లో జరిగిన అగ్నిప్రమాదంతో అక్కడి జనం భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఒకరు గాయపడగా.. షెడ్డు కూలిపోయింది.
కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని సుభాష్నగర్, రాంరెడ్డినగర్, సాయిబాబానగర్, సూరారం, అపురూపకాలనీ, ఎస్ఆర్నాయక్నగర్, భాగ్యలక్ష్మికాలనీ, అయోధ్యనగర్, వినాయక్నగర్, గంపలబస్తీ తదితర ప్రాంతాల్లో వ్యాపారం పేరుతో పలువురు అక్రమార్కులు మున్సిపల్ నుంచి ట్రేడ్ లైసెన్స్ పొందుతున్నారు. అయితే ట్రేడ్ లైసెన్స్ ఇచ్చే సమయంలో ఏం వ్యాపా రం చేస్తారు. అది అక్రమమా.. సక్రమమా అని సర్కిల్ అధికారులు పూర్తి విచారణ చేపట్టాలి. అవేవి పట్టించుకోకుండా ట్రేడ్ లైనెస్స్లు జారీ చేస్తుండటంతో ట్రేడ్ లైసెన్స్ మాటున అక్రమ కెమికల్ వ్యాపారం జోరందుకున్నది.
మండే స్వభావం కలిగిన అంత్యం ప్రమాదకరమైన టోలిన్, మిథనాల్, ఇథనాల్, మిథెన్, ఆల్కహాల్, పెట్రో సంబంధిత రసాయనాలను ఈ అక్రమ గోడౌన్లలో నిల్వ చేస్తున్నారు. ఎండ వేడికి మండే స్వభావం ఉండటంతో నిత్యం అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.