మేడ్చల్, ఆగస్టు 17(నమస్తే తెలంగాణ): పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు మేడ్చల్ జిల్లాలో వేగంగా అడుగులు పడుతున్నాయి. 228 ఎకరాలలో పెద్ద మొత్తంలో పార్కు ఏర్పాటుకు జిల్లా అధికారులు భూసేకరణ చేపడుతున్నా రు. మేడ్చల్ జిల్లా మాదారంలో ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు పక్రియ శరవేగంగా జరుగుతుంది. మాదారంలో ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటుకు సర్వే నం: 225లో 228 ఎకరాల లావుని పట్టా భూమిని అధికారులు గుర్తించి భూసేకరణ చేపట్టిన విషయం విదితమే. పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన భూమిని ఇచ్చేందుకు రైతులు అంగీకరించారు. దీంతో రైతుల వారీగా సర్వే నిర్వహణను అధికారులు పూర్తి చేశారు. త్వరలోనే జిల్లా సంప్రదింపుల కమిటీ ద్వారా భూ పరిహారం చెల్లింపులపై నిర్ణయం తీసుకోనున్నారు.
లావుని పట్టాకు సంబంధించి రైతుల వద్దనున్న పత్రాల పరిశీలనను రెవెన్యూ అధికారులు పూర్తి చేశారు. జిల్లా సంప్రదింపుల కమిటీ నిర్ణయం తీసుకుని రైతులతో త్వరలోనే సమావేశం నిర్వహించి, భూ పరిహారం చెల్లింపులను వెల్లడించనున్నారు. దీంతో పారిశ్రామిక పార్క్ ఏర్పాటు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మేడ్చల్ జిల్లా అధికారులు వేగవంతం చేసినైట్లెంది. 228 ఎకరాలలో ఏర్పాటు కానున్న మాదారం పారిశ్రామిక పార్క్లో వందల సంఖ్యలో పరిశ్రమలు ఏర్పడితే వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అయితే, పర్యావరణ రహిత పరిశ్రమలకే అనుమతి ఇవ్వనున్నారు.
పరిశ్రమల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న మేడ్చల్ జిల్లాలో పరిశ్రమలు ఏర్పడితే అనేక మందికి ఉపాధి లభిస్తుందన్న ఆలోచనలో ప్రభుత్వం పారిశ్రామిక పెట్టుబడులకు ప్రోత్సాహం అందిస్తుంది. అందులో భాగంగా పరిశ్రమలు ఏర్పాటు చేసిన పారిశ్రామికవేత్తలకు వివిధ రాయితీలను అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 4,086 పరిశ్రమలు ఏర్పడ్డాయి. అంతకు ముందున్న పరిశ్రమలతో కలిసి 8,651 పరిశ్రమలు ఉన్న మేడ్చల్ జిల్లా రాష్ట్రంలోనే అత్యధిక పరిశ్రమలు ఉన్న జిల్లాగా కీర్తిని ఆర్జించింది. పరిశ్రమల ద్వారా 2,02,500 మందికి ఉపాధి అవకాశం లభించింది.
మాదారంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటులో భా గంగా భూ పరిహార చెల్లింపులపై జిల్లా సంప్రదింపుల కమిటీ త్వరలోనే నిర్ణయం తీసుకుంటుంది. రైతుల అంగీకారంతో రైతుల వారీగా సర్వేను పూర్తి చేశాం. రైతులు ఇచ్చిన భూములకు పరిహారం నిర్ధారించి భూ పరిహారం అందిస్తాం. భూ పరిహారం పూర్తయిన వెంటనే టీఎస్ఐఐసీకి అప్పగిస్తాం. – లింగ్యా నాయక్, భూ సేకరణ అధికారి