కేపీహెచ్బీ కాలనీ : పారిశ్రామికవాడలో పనిచేస్తున్న కార్మిక హక్కులను కాపాడేందుకు ఎల్లప్పుడు కృషి చేస్తానని కూకట్పల్లి నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం నాయకుడు రవిసింగ్ అన్నారు. కూకట్పల్లి ఐడీఏ గాంధీనగర్ పారిశ్రామిక వాడలోని ఆర్ఎన్డీ ఇంజినీరింగ్ పరిశ్రమలో కార్మికుల అలవెన్స్లపై యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కార్మికులు సమస్యను రవిసింగ్ దృష్టికి తీసుకొచ్చారు. శనివారం ఇంజినీరింగ్ పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడిన రవిసింగ్ కార్మికుల అలవెన్స్లను ఇప్పించేందుకు ఒప్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికీ రూ.6400 వేతనంతో పాటు అదనపు అలవెన్స్లు ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించినట్లు తెలిపారు. ట్రావెల్ అలవెన్స్లు, వాషింగ్ అలవెన్స్లు, అటెండెన్స్ బోనస్లు, రెండు జతల బూట్లు ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల హక్కులను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని, వారి హక్కుల కోసం పోరాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసాచారి, సంతోష్ గౌడ్, రవికుమార్, దేవేందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.