మేడ్చల్, జూన్8(నమస్తే తెలంగాణ): లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టపరంగా నేరమని మేడ్చల్ జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్రావు అన్నారు. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లో మంగళవారం జిల్లా స్థాయి సలహా సంఘ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైద్యాధికారి మల్లికార్జున్ రావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు తెలితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు దవాఖానలు, స్కానింగ్ సెంటర్ల అనుమతులను రద్దు చేస్తామని హెచ్చరించారు. స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు స్కానింగ్ చేసిన తర్వాత అడ, మగ అని చెబితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా 715 స్కానింగ్ సెంటర్లకు అనుమతులు ఉండగా.. మూడు సెంటర్లపై కేసులు నమోదు చేసి మూసివేయడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా మాస్ మీడియా అధికారి వేణుగోపాల్రెడ్డి, డీపీఆర్వో కిరణ్, ఎన్జీవో కుమారకృప, సలహా సంఘం సభ్యులు డాక్టర్లు మంజుల, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.