మేడ్చల్, జూలై 29 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రంలో విస్తారంగా అడవుల విస్తీర్ణం పెరిగిందని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. మేడిపల్లిలో నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఆవరణలో గురువారం హరితహారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి మాట్లాడుతూ గ్రీనరీలో రాష్ట్రం దేశంలోనే నంబర్వన్గా నిలిచిందన్నారు. అడవులు సమృద్ధిగా పెరిగితే.. సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండుతాయని చెప్పారు. రాష్ట్రంలో 230 కోట్ల ప్లాంటేషన్గాను ఇప్పటి వరకు 90 శాతం పూర్తయిందని మంత్రి వివరించారు. శాంతిభద్రతలు, ఫ్రెండ్లీ పోలీసింగ్లో మన పోలీసులు దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచినట్లు వెల్లడించారు.
హరితహారంతో రాష్ట్రంలో అటవీ సంపద పెరిగిందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణే కాకుండా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో పోలీసులు ప్రజలతో మమేకమవుతున్నారని డీజీపీ మహేందర్రెడ్డి పేర్కొన్నారు. కాగా, పోలీస్ కమిషనరేట్ ఆవరణలో మంత్రులు మహమూద్అలీ, మల్లారెడ్డి, డీజీపీ మహేందర్రెడ్డి, సీపీ మహేశ్భగవత్, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్రెడ్డి ఇతర ఉన్నత పోలీస్ అధికారులు మొక్కలు నాటారు. ఏడున్నర ఎకరాల్లో లక్ష మొక్కలు నాటే ప్రణాళికలో భాగంగా గురువారం 40 వేల మొక్కలు నాటారు. మరో 60 వేల మొక్కలను త్వరలోనే నాటనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్రెడ్డి, ఆర్ఎం దొబ్రియల్, అటవీశాఖ ఉన్నతాధికారి అక్బర్, పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ కోలేటి దామోదర్, పోలీస్ ఉన్నతాధికారులు స్వాతీలక్రా, గేయ రచయిత అనంత్ శ్రీరామ్, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబిన్స్ తదితరులు పాల్గొన్నారు.