మేడ్చల్, జూన్20(నమస్తే తెలంగాణ): పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమాన్ని ఈ ఏడాది విజయవంతం చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. హరిత లక్ష్యంలో భాగంగా ఈ ఏడాది మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 63 లక్షల మొక్కలు నాటనున్నారు. మొక్కలు నాటుతూనే.. ఇంటింటికీ వివిధ రకాల ఆరు మొక్కలను అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖలు భాగస్వామ్యం కానున్నాయి.
సోమవారం మేడ్చల్ జిల్లాలో జరిగే సమావేశంలో హరితహారంలో మొక్కలు నాటే యాక్షన్ప్లాన్ను సిద్ధం చేయనున్నారు. ఈ సమావేశం కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అధ్యక్షతన జరగనుండగా.. ఇందులో జిల్లాస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.
మేడ్చల్ జిల్లాలో హరితహార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 7వ విడత హరితహారంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి. సోమవారం హరితహారం నిర్వహణపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించనున్నాం. సమావేశంలో జిల్లా అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. సమావేశం అనంతరం హరితహారం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తారు. మొక్కలు నాటడంతో పాటు ప్రతి ఇంటికీ ఆరు మొక్కలను అందజేయనున్నాం. చామకూర మల్లారెడ్డి, కార్మికశాఖ మంత్రి