జీరో వేస్ట్ దిశగా గుండ్లపోచంపల్లి..
సంపూర్ణ పారిశుధ్యానికి కార్యాచరణ..
హరితాలయతో ఒప్పందం
తడి, పొడి చెత్త సేకరణపై అవగాహన..
పరిశుభ్రంగా మారుతున్న వీధులు, రహదారులు
మేడ్చల్ రూరల్, ఏప్రిల్ 2: మార్పు అనేది మన నుంచే రావాలంటారు.. అలా ప్రజల్లో వస్తున్న చైతన్యంతో ఇప్పుడు గుండ్లపోచంపల్లి సంపూర్ణ పారిశుధ్యం దిశగా అడుగులు వేస్తున్నది. స్వచ్ఛతకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక మంచి ఫలితాలు ఇస్తున్నది. ‘హరితాలయ’ సహకారంతో తడి, పొడి చెత్త సేకరణపై కల్పించిన అవగాహనతో ప్రజలు సైతం తమవంతు బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఫలితంగా వీధులు, రోడ్లు , ఖాళీ స్థలాలు పరిశుభ్రంగా మారుతున్నాయి.
మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల వారీగా నిర్వహిస్తున్న అవగాహన పూర్తయింది. 1, 2, 3, 4, 5, 7, 12, 13 తదితర వార్డుల్లో అవగాహన కల్పించారు. తడి, పొడి చెత్తను ఎలా వేరు చేయాలో నేర్పించారు. వాటి వల్ల కలిగే లాభాలను వివరించారు. ప్రజల్లోనూ మంచి స్పందన వచ్చింది. తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించి, మున్సిపల్ కార్మికులకు అందజేస్తున్నారు. రోడ్ల పక్కన చెత్తను పారవేయడం లేదు.
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో సుమారు 12 టన్నుల వ్యర్థాలు ప్రతిరోజు వెలువడుతున్నాయి. ఏడు టన్నుల తడి , మూడున్నర టన్నుల పొడి చెత్త వస్తుండగా, మిగతా రెండున్నర టన్నుల వరకు ప్యాడ్స్, డబ్బాలు తదితర వ్యర్థాలు వస్తున్నాయి. చెత్తను రీసైక్లింగ్ చేసే వ్యవస్థ లేకపోవడంతో వ్యర్థాలు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. సుమారు 2వేల టన్నుల వరకు నిల్వ కావడంతో రాంఖీ సంస్థకు తరలించి రీసైక్లింగ్ చేయించారు. ఈ చెత్త సమస్య పరిష్కారానికి మున్సిపాలిటీ అధికారులు, పాలకవర్గ సభ్యులు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఇందుకోసం హరితాలయ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. ఎనిర్వాన్మెంట్ ఇంజినీర్ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఆ సంస్థ సభ్యులు, మున్సిపాలిటీ కార్మికులు ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను వేరు చేయడంపై అవగాహన కల్పిస్తున్నారు.
పరిసరాల శుభ్రతకు తోడ్పాటునివ్వాలి.. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి కార్మికులకు అందజేయాలి. తద్వారా పరిసరాల పరిశుభ్రతకు తోడ్పాటునివ్వాలి. కేవీరెడ్డినగర్, మైసమ్మగూడలో వ్యర్థాల నిర్వహణ కొద్దిగా సమస్యగా ఉంది. చాలా వరకు వార్డుల్లో మార్పు వచ్చింది. వచ్చే ఏప్రిల్ నాటికి జీరో వేస్ట్ను సాధిస్తాం. పొడి చెత్తను సేకరించి వారం రోజులకోసారి ఇచ్చినా సరిపోతుంది. తడి చెత్తను మాత్రం రోజు అందజేయాలి. -అమరేందర్రెడ్డి, కమిషనర్ గుండ్లపోచంపల్లి
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో 7వేల ఇండ్లు ఉండగా , సుమారు 2,500 మంది గేటెడ్ కమ్యూనిటీల్లో నివసిస్తున్నారు. తడి, పొడి చెత్త సేకరణకు 14వేల డస్ట్బిన్లను పంపిణీ చేశారు. వాటి సేకరణపై అవగాహన కల్పించడంతో పాటు వీధుల్లో చెత్తను పారవేసే వారికి జరిమానాలు సైతం విధిస్తున్నారు. కేవీరెడ్డి నగర్లో, గుండ్లపోచంపల్లి నుంచి కొంపల్లి వెళ్లే దారిలో చెత్తను పారవేస్తున్న వారిపై కూడా నిఘా పెట్టి, దారికి తీసుకువచ్చారు. అంతేకాదు ఇంట్లోనే తడి చెత్తతో కంపోస్టు ఎరువు తయారు చేసుకొని, పూలు, పండ్లు ఇతరత్రా మొక్కలకు వినియోగించుకునేలా సుతారిగూడలో అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
అర్కెలగూడలో డీఆర్సీని ఏర్పాటు చేశారు. పొడి చెత్తను విక్రయించే ఏర్పాట్లు చేశారు. తడి చెత్తను కంపోస్టు ఎరువుగా తయారు చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ ఎరువును హరితహారం మొక్కలకు వినియోగించుకోవాలని నిర్ణయించారు.
ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాం. హరితాలయ సంస్థ ద్వారా, అవగాహన ర్యాలీలు నిర్వహిస్తూ తడి, పొడి చెత్త సేకరణపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. వార్డుల వారీగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఫలితానిస్తున్నది. అనుకున్న లక్ష్యం నెరవేరాలంటే మున్సిపాలిటీ అమలు చేస్తున్న కార్యాచరణలో భాగస్వాములు కావాలి. -లక్ష్మీశ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్, గుండ్లపోచంపల్లి