వేసవి వచ్చిందటే భూగర్భ జలాలు అడుగంటి పోతాయి. పుష్కలంగా పోసే బోర్లు రోజుల వ్యవధిలోనే గ్యాబ్ ఇస్తూ పోస్తాయి. పొలానికి నీరు అందక పెట్టిన పంట చేతికి వచ్చే సమయంలో ఎండిపోతుంది. అది చూసిన రైతుల గుండెలు అవిసిపోతున్నాయి. నాటినుంచి ఇలా రైతుల కష్టాలను కండ్లార చూసిన బాలవికాస బృహత్తర నిర్ణయంతో జల సిరులు కురిపిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నది. గుంట స్థలం ఉంటే చాలు.. సొంత నిధులతో పొలం కుంటలను ఏర్పాటు చేస్తుంది. భూగర్భ జలాలకు పునరుజ్జీవం పోస్తున్నది. ఫాం పాండ్స్ ఏర్పాటుతో బోర్లు రీ చార్జి అవుతున్నాయి. భూగర్భంలో తేమ పెరిగి నీటి వినియోగం తగ్గుతుంది. రైతులకు పుష్కలంగా పంట చేతికి వస్తుంది.
బాల వికాస నిర్ణయం రైతులకు జల సిరులు కురిపిస్తున్నది. రెండు గుంటల్లో ఏర్పాటు చేసే పొలం కుంటలతో ఆగిఆగి పోసే బోర్లు గ్యాబ్ ఇవ్వకుండా పోస్తున్నాయి. ఐదు తడులు అందించాల్సిన చోట మూడు తడులతోనే పుష్కలంగా పంట చేతికి వస్తుంది. స్థల నష్టాన్ని సైతం ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా పూడ్చుకునేలా రైతులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఒక్కో గుంటకు రూ.20వేలు ఖర్చు చేస్తూ ఏడాది కిందట ఫాంపాండ్స్ ఏర్పాటుకు పునాది వేసి బహుళ ప్రయోజనాలతో రైతులకు లాభాన్ని చేకూరుస్తున్న బాల వికాస నిర్ణయానికి రైతులు ఫిదా అవుతున్నారు. ఇప్పటికే 68చోట్ల రైతుల పొలంలో ఏర్పాటు చేయగా మంచి ఫలితాన్ని ఇస్తుండటంతో అనేక మంది రైతులు ఆసక్తి చూపుతున్నారు.