మేడ్చల్, జూన్ 11(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ భూముల వివరాల సమాచారాన్ని సేకరించే పనిలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది. మేడ్చల్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూముల సమగ్ర సమాచార జాబితాను సిద్ధం చేసే పనిలో అధికారులు ఉన్నారు. ప్రభుత్వ భూములను గుర్తించి తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. రెండు నెలల క్రితం ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులు గుర్తించి నివేదికను సిద్ధం చేశారు. అయితే, మరోమారు ప్రభుత్వ భూముల వివరాలను సేకరించాలని నిర్ణయించారు. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉన్న మేడ్చల్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. దీంతో జిల్లా వ్యాప్తంగా భూములకు డిమాండ్ ఏర్పడి ఎకరాకు కోట్ల రూపాయలకు పైగా ధర పలుకుతుంది. అత్యధిక పరిశ్రమలు ఉండి రాష్ట్రంలో మేడ్చల్ జిల్లా నంబర్వన్గా నిలిచింది. కాగా, ఇప్పటి వరకైతే జిల్లాలో సుమారు 40 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నట్లు తెలుస్తుంది. ఒకే దగ్గర కాకుండా ఐదు నుంచి ఆరు ఎకరాల వరకు బిట్లుబిట్లుగా ఉన్నట్లు తెలుస్తుంది.
జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తిస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు మేడ్చల్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూముల సమాచారాన్ని సేకరించి నివేదికను సిద్ధం చేస్తాం. ప్రభుత్వ భూములను గుర్తిస్తున్నాం. ప్రభుత్వ భూముల పరిరక్షణలో భాగంగా భూములను గుర్తించి తదుపరి చర్యలు తీసుకుంటాం. రెండు నెలల క్రితం ప్రభుత్వ భూములను గుర్తించాం. మరోమారు వివరాలను సేకరిస్తున్నాం. శ్వేతా మహంతి, ఇన్చార్జి కలెక్టర్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా