దుండిగల్, జూన్ 9: ప్రభుత్వ స్థలం తమదంటూ సరిహద్దులను చెరిపి చదును చేస్తూ మాజీ ఎమ్మెల్యే సిబ్బంది, తమ్ముడు ప్రభుత్వ అధికారులను బంధించి, వారిపై దుర్భాషలాడిన ఘటన బుధవారం కూత్బుల్లాపూర్ పరిధిలో చోటు చేసుకుంది. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ఇంటి సెక్యూరిటీ సిబ్బంది అటవీ శాఖ అధికారుల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన అధికారులను నిర్బంధించి, దూషణకు పాల్పడ్డారు. అయితే, శ్రీశైలం గౌడ్ జోక్యం చేసుకుని అధికారులను విడిపించినట్లు సమాచారం. దూలపల్లి ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీదేవి కథనం ప్రకారం, గాజుల రామారం సర్కిల్, కైసర్నగర్లోని సర్వే నంబర్ 28లో కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ కుటుంబ సభ్యులకు రెండెకరాల భూమి ఉంది.
దీనిని ఆనుకుని సర్వే నంబర్ 19లో 71.14 ఎకరాల అటవీ శాఖ భూములు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సర్వే నంబర్ 28ని అడ్డుపెట్టుకుని, సర్వే నంబర్ 19లోని అటవీ శాఖ స్థలాన్ని మంగళవారం కూన శ్రీశైలం గౌడ్ సోదరుడు కూన జై కుమార్ గౌడ్ చదును చేశాడు. మంది మార్బలంతో హద్దులు ఏర్పాటు చేసుకుని దర్జాగా కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ సెక్షన్ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు సిబ్బంది అక్కడకు వెళ్లి చదును చేసే పనులను అడ్డుకున్నారు.
దీంతో కూన జై కుమార్ గౌడ్, అటవీ శాఖ అధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం, ఇదే విషయమై జై కుమార్ గౌడ్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులు దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. అదే సమయంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల (ఎంట్రీ మాడర్) ప్రకారం, తమ స్థలాన్ని తాము చదును చేసుకుంటుండగా అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారని జై కుమార్ గౌడ్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బుధవారం ఉదయం అటవీ శాఖ ఉన్నతాధికారుల ఆదేశంతో దూలపల్లి సెక్షన్ అధికారి శ్రీనివాస్రెడ్డి, బీట్ ఆఫీసర్ రవీంద్రచారీలు కూన జై కుమార్ గౌడ్కు నోటీసులు అందజేసేందుకు షాపూర్ నగర్లోని ఆయన ఇంటికి వెళ్లారు. జై కుమార్ గౌడ్ ఇంట్లో లేరని అక్కడ విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డులు అధికారులకు తెలిపారు. అయితే, వారి కుటుంబ సభ్యులు ఉన్నా పిలవమని అటవీ శాఖ అధికారులు కోరగా, ఇంట్లో ఎవరూ లేరన్నారు. అయితే, తాము తీసుకువచ్చిన నోటీసులను గోడకు అతికిస్తామని ప్రహరీ గేటు లోపలికి అధికారులు వెళ్లగా, ఆగ్రహించిన సెక్యూరిటీ గార్డులు గేట్లు మూసివేసి అధికారులను నిర్బంధించి, దుర్భాషలాడారు. కొంత సమయం అనంతరం శ్రీశైలం గౌడ్ ఇంటికి చేరుకుని అధికారులను అక్కడి నుంచి పంపించి వేశారు.
అటవీ శాఖకు సంబంధించిన భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాక్రాంతం కానివ్వం. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే సోదరుడు కూన జై కుమార్ గౌడ్ పట్టా స్థలంపేరుతో అటవీశాఖ భూములను చదును చేసిండు. దాన్ని అడ్డుకోబోయిన మా సిబ్బందితో వాగ్వాదానికి దిగి, బెదిరింపులకు పాల్పడ్డాడు. ఎవరెన్ని బెదిరింపులకు దిగినా మేము భయపడేది లేదు. విధి నిర్వహణలో ఉన్న అధికారులను బంధించడం చట్ట వ్యతిరేకం. దీనిపై చట్టపరంగాను మేము ముందుకెళ్తాం. అటవీ శాఖ భూములను రక్షించి తీరుతాం.- శ్రీదేవి, దూలపల్లి ఫారెస్ట్ రేంజ్ అధికారి