రెండో విడుత రుణమాఫీ నిర్ణయం పై సర్వత్రా హర్షం
మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా లబ్ధి పొందనున్న 4200 మంది రైతులు
మేడ్చల్, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ): రెండో విడుత రుణమాఫీ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని రైతులు పేర్కొంటున్నారు. రుణమాఫీ నిర్ణయంతో మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా 4200 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. దీంతో రైతులకు రూ. 21 కోట్ల మేర లబ్ధి జరగనుంది. రూ. 25 వేలకు పైగా రూ.50 వేల వరకు రుణాలు తీసుకున్న వారికి రెండో విడుత రుణమాఫీ వర్తించనుంది. మొదటి విడుతలో రూ. 25 వేల రుణమాఫీలో భాగంగా 6632 మంది రైతులు లబ్ధి పొందిన విషయం తెలిసిందే. రైతుబంధు పథకం, రుణమాఫీ నిర్ణయాలతో రైతుల పక్షాన ప్రభుత్వం ఉంటుందని సీఎం కేసీఆర్ నిరూపించారని రైతులు మురిసిపోతున్నారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా వానకాలం(ఖరీఫ్)సీజన్లో రైతుబంధు పథకం కింద రూ. 30,666 మంది రైతుల ఖాతాల్లో రూ. 33 కోట్లు వేశారు. ఈ నెల 15లోపు రుణమాఫీ జాబితాను సిద్ధం చేసి లబ్ధిదారులకు వర్తింపజేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా మొదటి, రెండో విడుతలో సుమారు 10వేలకు పైగా రైతులు లబ్ధి పొందనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.