శామీర్పేట, మే 19 : వృద్ధురాలి మెడలో ఉన్న పుస్తెల తాడుపై నిందితుడి కన్ను పడింది. ఎలాగైనా అపహరించాలనుకున్నాడు. పథకం ప్రకారం ఫోన్ చేసి ఎవరూలేని ప్రాంతానికి రప్పించుకున్నాడు. వృద్ధురాలిని హతమార్చి.. పుస్తెల తాడును తెంచుకుని పారిపోయాడు. విచారణలో పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలయ్యాడు. ఈ నెల 15న లాల్గడి మలక్పేటలో చోటుచేసుకున్న వృద్ధురాలి హత్య కేసును ఎట్టకేలకు శామీర్పేట పోలీసులు ఛేదించారు. సీఐ సుధీర్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. లాల్గడి మలక్పేటకు చెందిన పొలంపల్లి లక్ష్మి(60) పుస్తెల తాడుపై అదే గ్రామానికి చెందిన నరేశ్ కన్నుపడింది. ఎలాగైనా పుస్తెల తాడును అపహరించాలని నిర్ణయించుకున్నాడు.
పథకం ప్రకారం హత్యకు రెండు రోజుల ముందే రెక్కీ నిర్వహించాడు. గ్రామంలోని సెంట్రింగ్ వర్కర్స్ కమ్యూనిటీ హాల్ను ఎంచుకున్నాడు. ఈ నెల 15న నరేశ్ మద్యం సేవించి లక్ష్మికి ఫోన్ చేశాడు. రంజాన్ సందర్భంగా భర్తలేని వారికి సెంట్రింగ్ వర్కర్స్ కమ్యూనిటీహాల్లో బియ్యం ఇస్తున్నారని నమ్మబలికాడు. కమ్యూనిటీహాల్లోకి తీసుకువెళ్లి.. కొద్ది సేపట్లో వారు వస్తారంటూ మాటల్లో పెట్టాడు. చుట్టుపక్కల ఎవరూలేకపోవడంతో అదే అదునుగా భావించి లక్ష్మి తలపై బలంగా కొట్టాడు. తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో నరేశ్ వృద్ధురాలి మెడలోని బంగారు పుస్తెల తాడు (3.6 తులాలు), సెల్ఫోన్ తీసుకుని నేరుగా అక్కడినుంచి ఇంటికి వెళ్లిపోయాడు.
అనంతరం దొంగిలించిన పుస్తెల తాడును వంటిమామిడిలోని ఓ బంగారం షాపులో రూ.26 వేలకు కుదవ పెట్టాడు. ఇదిలా ఉండగా.. అదే గ్రామానికి చెందిన కన్రెడ్డి చంద్రారెడ్డి లక్ష్మి కనిపించడంలేదని ఈ నెల 16న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. కమ్యూనిటీహాల్లో వృద్ధురాలి మృతదేహం లభ్యమైంది. ఈ హత్య కేసులో అనుమానం ఉన్న నరేశ్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో సెల్ఫోన్, రూ.26 వేలు, కుదువ పెట్టిన బంగారం చీటిని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.