చర్లపల్లి, నవంబర్ 28 : కాప్రా సర్కిల్లో వీరశైవులకు సామాజిక భవనం నిర్మాణం కోసం స్థలం కేటాయించేందుకు తగు చర్యలు తీసుకుంటామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. చర్లపల్లి డివిజన్, వాసవిశివనగర్లోని కన్యకా పరమేశ్వరి శివాలయంలో ఏర్పాటు చేసిన వీరశైవుల కార్తిక మాస భోజన సమారాధన కార్యక్రమంలో చర్లపల్లి, హెచ్బీకాలనీ డివిజన్ కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, ప్రభుదాస్లతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో వీరశైవులను బీసీల గర్తించి, సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. జాతీయ స్థాయిలో ఓబీసీలుగా గుర్తించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి మాట్లాడుతూ వీరశైవుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
అర్హులైన వీరశైవులు ప్రభుత్వం ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొవాలని ఆమె సూచించారు. అనంతరం నిర్వహకులు ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, ప్రభుదాస్లను ఘనంగా సన్మానించారు.