దుండిగల్, ఏప్రిల్ 24 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన ఎర్లీబర్డ్ పథకానికి విశేష స్పందన లభిస్తున్నది. ఈ నెల 30వ తేదీ వరకు ఆస్తి పన్ను చెల్లింపులో 5శాతం రిబేట్ను ఇస్తుండటంతో ఆస్తిపన్ను చెల్లింపుదారులు పన్నులు చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం ఒక్కరోజే మున్సిపాలిటీకి ఆస్తిపన్ను రూపేనా రూ. 26,39,224 ఆదాయం చేకూరింది. ఇందులో దుండిగల్ వార్డు పరిధిలోని ఎంఎల్ఆర్ఐటీ, ఎంఎల్ఆర్ఐటీఎం కళాశాలల యాజమాన్యం రూ. 13,45,162 ఆస్తి పన్ను ను చెల్లించగా, సోహైయల్ ల ఖానీ పరిశ్రమ నిర్వహకులు రూ. 2,15,078 చెల్లించారు. అదే విధంగా బౌరంపేట వార్డు పరిధిలోని వీఎన్ఆర్, విజ్ఞానజ్యోతి విద్యాసంస్థల వసతిగృహంకు సంబంధించిన పన్ను రూ.4,69,496, కోకాకోలా గోదాం యాజమాన్యం రూ. 3,56,474 పన్నును చెల్లించారు. ఇందుకు సంబంధించిన మొత్తాన్ని ఆయా వార్డుల బిల్కలెక్టర్లు శనివారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ భోగేశ్వర్లుకు అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని ఆస్తిపన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం ఎర్లీబర్డ్ పథకం కింద ఈ నెల 30వ తేదీ వరకు ఆస్తి పన్ను చెల్లింపులో 5శాతం రిబేట్ను ఇస్తుందన్నారు. ఈ అవకాశాన్ని ఆస్తి పన్ను చెల్లింపుదారులు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ సునంద, ఆయా వార్డులకు చెందిన బిల్కలెక్టర్లు పాల్గొన్నారు.
కరోనా సెకండ్వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా భారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని స్వీయ నియంత్రణ పాటించాలని దుండిగల్ మున్సిపాలిటీ కమిషనర్ భోగీశ్వర్లు అన్నారు. ఇంటెన్సివ్ డిస్ఇన్ఫెక్టెంట్ డ్రైవ్లో భాగంగా మున్సిపాలిటి సిబ్బందితో కలిసి శనివారం పలు వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత శుభ్రతను పాటించాలని సూచించారు. ప్రజలు అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సామాజిక దూరం పాటించాలని స్పష్టం చేశారు. అనంతరం పలు వార్డుల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయించారు. మురికినీరు నిలువుండే చోట బ్లిచింగ్ పౌడర్ చల్లించారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ సానిటరీ ఇన్స్పెక్టర్ కరుణాకర్రెడ్డి, ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.