కమ్మర్పల్లి, ఏప్రిల్ 28: కరోనా కాలంలోనూ వరి కొనుగోళ్లు నిర్వహిస్తూ మహిళా సంఘాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సహకరించకున్నా ప్రతి గింజనూ కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం తలపెట్టిన ధాన్యం కొనుగోలు యజ్ఞంలో మహిళలు భాగస్వాములవుతున్నారు. కొవిడ్ విలయ తాండవం చేస్తున్న సమయంలోనూ వెరువకుండా కొనుగోళ్లు జరుపుతూ అన్నదాతకు సేవలందిస్తున్నారు అతివలు. గత సంవత్సరం కొవిడ్ సమయంలో కొనుగోళ్లు చేపట్టిన మహిళా సంఘాలు ఈసారి కూడా ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా ధైర్యంగా ధాన్యం కొనుగోలు చేస్తూ రైతుల మన్ననలు అందుకుంటున్నారు.
కొవిడ్ విజృంభించినా..
కొవిడ్ విపత్తు కారణంగా పండించిన ధాన్యం కొనుగోళ్లు నిర్వహించకపోతే రైతన్న తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొంటుందని భావించి ఎంత కష్టమైనా సరే కొనుగోలు చేస్తూ వస్తోంది రాష్ట్ర సర్కారు. గత సంవత్సరం ఊరూరా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చేసింది. ఈ సంవత్సరం కూడా కొవిడ్ విజృంభిస్తున్నా సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఎక్కడికక్కడే వరి కొనుగోళ్లు చేపట్టింది. కేంద్రంలోని బీజేపీ సర్కారు తమ పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ ఇలా గ్రామ గ్రామాన కొనుగోళ్లు చేపట్టడం లేదు. కొనుగోళ్లు జరుపుతున్న రాష్ట్ర ప్రభుత్వానికీ కేంద్రం సహకరించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కొనుగోళ్లలో తమవంతు పాత్రను పోషిస్తూ ముందుకు వెళ్తున్నారు మహిళా సంఘాల సభ్యులు.
లక్ష్యానికి అనుగుణంగా..
గత సంవత్సరం ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా జిల్లాలో కొనుగోళ్లు నిర్వహించిన మహిళా సంఘాలు ఈసారి ముమ్మరంగా వరి కొనుగోళ్లు జరుపుతున్నాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ధాన్యం కొనుగోళ్లు చేపడుతూ రైతుల ఇబ్బందులు తీరుస్తున్నారు. యాసంగి సీజన్లో జిల్లాలో ఐకేపీ ఆధ్వర్యంలో మహిళా సంఘాలు 38 కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో కొనుగోళ్లు ప్రారంభించగా, ఇప్పటి వరకు జిల్లాలో రూ.22 కోట్ల 82 లక్షల 8920 విలువైన 121208 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించారు. ఇందులో రూ.16 కోట్ల 92 లక్షల 294 విలువైన 89618.80 క్వింటాళ్ల గ్రేడ్ ఏ రకం వడ్లు, రూ.5కోట్ల9 లక్షల8625 విలువైన 31589.20 క్వింటాళ్ల కామన్ వెరైటీ వడ్లు ఉన్నాయి. మహిళా సంఘాలు అందిస్తున్న కొనుగోలు సేవలకు అనుగుణంగా జిల్లా అధికారులు లారీలతోపాటు ఎప్పటికప్పుడు తగిన సౌకర్యాలు కల్పిస్తున్నారు.