మేడ్చల్, జూన్ 10(నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్లోని పెండింగ్ ఫైళ్లను రెవెన్యూ అధికారులు క్లియర్ చేశారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఆరువేల పెండింగ్ ఫైళ్లకు గాను 5,200 ఫైళ్లను పరిష్కరించారు. మరో 800 ఫైళ్లు (పీఓబీ)కి చెందినవి కావడంతో త్వరలోనే పరిష్కరించనున్నట్లు రెవెన్యూ అధికారులు వెల్లడించారు. పెండింగ్ ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 5,200 ఫైళ్లను మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్వేతా మహంతి పరిష్కరించారు. పెండింగ్ ఫైళ్ల పరిష్కారంతో భూములకు సంబంధించిన యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నూతన రెవెన్యూ చట్టం ద్వారా ధరణి పోర్టల్కు దరఖాస్తులు చేసుకున్న వెంటనే అధికారులు త్వరితగతిన ఫైళ్లను పరిష్కరిస్తున్నారు. మ్యుటేషన్లు, ల్యాండ్ మ్యాటర్లో తప్పుడు పేర్లు, సర్వే నెంబర్లను సరిచేశారు. డిజిటల్ సైన్ల పెండింగ్ ఫైళ్లు పూర్తయ్యాయి. పీఓబీ(ఎన్వోసి)కి సంబంధించిన ఫైళ్లను పరిశీలించి త్వరిగతన పరిష్కరించనున్నట్లు అధికారులు వెల్లడించారు. పీఓబీ (ఎన్వోసీలు) జారీ చేసే ముందు ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోనున్నారు. మరో రెండు మూడు రోజులలో ఫైళ్లను పరిష్కరించే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ధరణి పోర్టల్లో వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కారం లభిస్తుంది.