మేడ్చల్ కలెక్టరేట్, జూన్ 14: రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ కోరారు. ప్రపంచ రక్తదాత దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీసులు, రెడ్క్రాస్, శ్రీ అష్టోత్రసత్తా చుక్కల ట్రస్ట్ ఆధ్వర్యంలో నాగారం మున్సిపాలిటీ పరిధిలోని సుర్వి బాబయ్య గార్డెన్స్లో సోమవారం ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని సీపీ మహేశ్ భగవత్ ప్రారంభించారు. అనంతరం రక్తదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలని కోరారు. అన్నిదానాల కన్నా రక్తదానం గొప్పదన్నారు. ఒకరి రక్తదానంతో మరొకరి ప్రాణం కాపాడవచ్చని అన్నారు. నాగారం టీఆర్ఎస్ యువనేత రాహుల్రెడ్డి టీం సభ్యులు 15 మంది రక్తదానం చేయగా సీపీ వారిని అభినందించారు. కార్యక్రమంలో మల్కాజిగిరి డీసీపీ రక్షిత మూర్తి, కుషాయిగూడ అదనపు డీసీపీ శివకుమార్, కీసర సీఐ నరేందర్, ఎస్ఐలు రామసూర్యం, రమేష్, రాజు పాల్గొన్నారు.