మేడ్చల్, మే 30 (నమస్తే తెలంగాణ) : కొవిడ్ చికిత్స పేరిట అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ దవాఖానలపై వైద్యశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. కొవిడ్ చికిత్సకు బాధితుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేసినట్లు వైద్యశాఖకు ఫిర్యాదు అందిన వెంటనే తక్షణ చర్యలు చేపడుతున్నారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా బాధితులు చేసిన ఫిర్యాదుల ఆధారంగా 3 ప్రైవేట్ దవాఖానల్లో కొవిడ్ వైద్య సేవలను రద్దు చేసినట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వైద్యాధికారి మల్లికార్జున్రావు వెల్లడించారు. మరో 10 దవాఖానలకు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. నోటీసులు జారీచేసిన దవాఖానలపై వైద్యశాఖ విచారణ కొనసాగుతుందన్నారు. బాధితులకు కూడా న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. రద్దు చేసిన వాటిలో ప్రస్తుతం కొవిడ్ చికిత్స పొందుతున్న వారికే అనుమతి ఉంటుందని.. కొత్తగా కొవిడ్ బాధితులను చేర్చుకోవద్దని ఆదేశాలు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా మ్యాక్స్ హెల్త్, సాయి సిద్ధార్థ, నీలిమ దవాఖానల్లో కొవిడ్ చికిత్సలను రద్దు చేశారు.