కరోనా రోగులకు ఊపిరి పోస్తున్న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రభుత్వ వైద్యశాల
ప్రత్యేక శ్రద్ధతో కరోనా రోగులకు చికిత్స.. సంవత్సర కాలంలో 168 మందికి సేవలు
మల్కాజిగిరి, మే 20: అదో ప్రభుత్వ దవాఖాన. స్వరాష్ట్రంలో అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంది. అక్కడికి వచ్చే రోగులను ఆత్మీయ పలకరింపుతో కావాల్సిన వైద్య సేవలందిస్తున్నది. మరీ ముఖ్యంగా కరోనా రోగుల పాలిట కల్పతరువుగా మారింది. ఒకరా ఇద్దరా సంవత్సర కాలంగా కరోనా బారిన పడిన 168 మందిని పూర్తి ఆరోగ్యవంతులుగా మార్చింది మేడ్చల్ మల్కాజిగిరి ప్రభుత్వ వైద్యశాల.
మేడ్చల్ మల్కాజిగిరి ప్రభుత్వ వైద్యశాల ముఖ్యంగా కరోనా రోగులకు ఊపిరి పోస్తున్నది. మహమ్మారి బారిన పడిన వారి కోసం ఈ వైద్యశాలలో అధికారులు ఐసొలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పదిహేను రోజుల పాటు అన్ని రకాల సేవలు అందించి పూర్తి ఆరోగ్యవంతులుగా మార్చి ఇంటికి పంపుతున్నారు. సంవత్సర కాలంలో 168 మందికి నయం చేసి ఇంటికి పంపారు.
ఈ ప్రభుత్వ వైద్యశాలలో ఇప్పటి వరకు 24 వేలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించగా.. 12 శాతం మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో వారందరికి వైద్యాధికారులు కిట్లు పంపిణీ చేశారు. స్వల్ప లక్షణాలు ఉన్న వారిని హోం ఐసొలేషన్ చేశారు. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారిని ఐసొలేషన్ సెంటర్కు తరలించారు. అంతేకాక 14 వేల మందికి కొవిడ్ టీకాలు సైతం వేశారు.
త్వరలో జిల్లా వైద్యశాలలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే ఆస్పత్రికి ఆక్సిజన్ ప్లాంటు పరికరాలు చేరుకున్నారు. మొత్తం రూ.1.50 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంటు పనులు మరో వారం రోజుల్లో పూర్తి కానున్నాయి.