మేడ్చల్ : కరోనా మళ్లీ విజృంభిస్తుంది.. వ్యాధిలో తీవ్రత తగ్గినా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.. జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. కరోనా కట్టడికి మేడ్చల్ జిల్లా వైద్యశాఖ అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా నివారణ చర్యలు తీసుకుంటున్నట్లు మేడ్చల్ జిల్లా వైద్యాధికారి మల్లికార్జునరావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 60 కేంద్రాల్లో ప్రతి రోజు మూడు వేల మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా సోకిన వారికి స్వల్ప లక్షణాలు మాత్రమే కనపడుతున్నాయని.. అనుమానం ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. పరీక్షల్లో పాజిటివ్ అని తేలితే.. వారికి అవసరమైన మందులను అందజేస్తూ, తగిన సూచనలు చేస్తున్నారు.
కరోనా వచ్చినా.. స్వల్ప లక్షణాలే…
కరోనా సోకినవారికి స్వల్ప లక్షణాలు మాత్రమే కనపడుతున్నాయని, అనుమానం వస్తే ప్రభుత్వ వైద్యులను సంప్రదించాలని జిల్లా వైద్యాధికారి మల్లికార్జునరావు సూచించారు. కరోనా వచ్చినవారు చికిత్స తీసుకున్న నాలుగు రోజుల్లోనే వైరస్ తగ్గుముఖం పడుతుందన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేకున్నా.. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని కోరారు. భౌతిక దూరం, మాస్కులు ధరించి రద్దీ ప్రాంతాల్లో జాగ్రత్తలు పాటించాలన్నారు.
ప్రతి రోజు 5వేల మందికి పైగా టీకాలు…
జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో 5వేల మందికిపైగా కరోనా టీకాలను తీసుకుంటున్నారు. టీకాలపై వైద్యశాఖ ప్రజలకు పూర్తి అవగాహన కల్పించడంతో ప్రజలు టీకాలు వేసుకునేందుకు ముందుకు వస్తున్నట్లు వైద్యాధికారి మల్లికార్జునరావు వివరించారు. రోజు రోజుకు టీకాలు వేసుకునే వారిసంఖ్య పెరుగుతుందన్నారు. బల్దియా ఉద్యోగులకు కరోనా టెన్షన్ పట్టుకుంది. గ్రేటర్ నగర ప్రజలకు సేవలందించే శాఖలో కీలకమైన జీహెచ్ఎంసీ కార్యాలయంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. బుధవారం ఇంజినీరింగ్ మెయింటనెన్స్ విభాగంలో పనిచేసే ఇద్దరు అసిస్టెంట్ ఇంజినీర్లు, ఒక డిప్యూటీ ఇంజినీర్ వైరస్ బారిన పడ్డారు. దీంతో ఆ సెక్షన్ ఉద్యోగులకు రెండు రోజుల పాటు సెలవులు ఇచ్చారు. ఈ క్రమంలోనే గురువారం మూడవ అంతస్తులోని స్పోర్ట్స్ విభాగంలో ఒక సిబ్బందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో స్పోర్ట్స్ విభాగాన్ని శానిటైజ్ చేశారు. ఏడవ అంతస్తులో ఇద్దరు ఆపరేటర్లకు వైరస్ సోకింది. నిత్యం వేలాది మంది సంచరించే కార్యాలయం వద్ద, అధికారుల చాంబర్ల వద్ద శానిటైజర్లు, భౌతికదూరం, నిబంధనలు కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.