మల్కాజిగిరి, ఏప్రిల్ 22: ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో మల్కాజిగిరి జోన్ పరిధిలో ప్రజలు భయాందోళనలతో బతుకును వెళ్లదీస్తున్నారు. వైద్యులు, అధికారుల సూచనలు పాటిస్తున్నా గాని ఎవరికి కరోనా వస్తుందో తెలియని అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు పత్రికల్లో, ప్రచారమాధ్యమాల్లో వస్తున్న కరోనా వార్తలతో అప్రమత్త చర్యలు తీసుకుంటున్నారు. కరోనా బారిన పడిన కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మరికొందరు కరోనాతో దవాఖానలో చేరాలంటేనే భయబ్రాంతులకు గురవుతున్నారు. టీకాలు వేసుకున్న వారికి కూడా లక్షణాలు కనిపిస్తుండడంతో ఆందోళన రెట్టింపు అవుతుంది. లక్షలు వెచ్చించినా దవాఖాన నుంచి ఇంటికి క్షేమంగా వస్తామా.. రామా..? అనే సందిగ్దంలో కొట్టుమిట్టాడుతున్నారు. మరొకొందరు దేవుడిపైనే భారం వేసి మమ్ములను మీరే రక్షించాలని రోజూ దేవుళ్లను ప్రార్థిస్తున్నారు.