వ్యాధి కట్టడికి వైద్యశాఖ పకడ్బందీ చర్యలు.. మేడ్చల్ జిల్లాలో రోజుకు 3వేల మందికి పరీక్షలు
కరోనా లక్షణాలు ఉంటే బడులకు పంపొద్దు.. విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యాశాఖ విజ్ఞప్తి
ఒకే రోజు 440 దాటిన పాజిటివ్ కేసులు.. ‘గాంధీ’ ఐసీయూలో 70మందికి చికిత్స
సిటీబ్యూరో/మేడ్చల్, మార్చి 19 (నమస్తే తెలంగా ణ): గ్రేటర్లో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. కేసులు ఒక్కసారిగా పెరుగుతుండడం ప్రజల్లో వైరస్పై నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. వారం రోజులుగా విద్యాసంస్థల్లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే గ్రేటర్ వ్యాప్తంగా 400కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికార వర్గాలు తెలిపాయి.ఒక హైదరాబాద్ నగరంలోనే 245 కేసులు కాగా రంగారెడ్డి జిల్లాలో 198 కేసులు నమోదయ్యాయి. ప్రజల్లో చాలా మంది మాస్కులు ధరించకపోవడం, భౌతికదూరం, చేతులకు శానిటైజర్ వంటివి పాటించకపోవడం, మార్కె ట్లు,ఫంక్షన్లలో పెద్ద సంఖ్యలో పాల్గొని ఒక్కచోట గుమి గూడడం వంటి చర్యల వల్లే వైరస్ మరోసారి విజృంభిస్తుందని వైద్యులు పేర్కొన్నారు.ఇప్పటికే గాంధీ దవాఖానలో 70మంది వరకు ఐసీయూలో అత్యవసర చికిత్స పొందుతుండగా మరో 75మంది పోస్టు కొవిడ్ చికిత్స పొందుతున్నట్లు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు వెల్లడించారు.
విద్యా సంస్థల్లో వైరస్ వ్యాప్తి..
ఇటీవల నాగోల్లోని మైనార్టీ రెసిడెన్సీయల్ స్కూల్ లో 38మందికి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా పరిధిలోని చిన్నగోల్కొండ పరిధిలో మరో పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులకు, నాగోల్లోని జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి, అనంతరం నగరంలోని పలు పాఠశాలలు, కళాశాలలకు చెందిన పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులకు పాజిటివ్ వచ్చింది. తాజాగా శుక్రవారం ఒక్కరోజే రాజేంద్రనగర్లోని ఎస్టీ బాయ్స్ హాస్టల్లో 22మంది విద్యార్థులతో పాటు ఇద్దరు హాస్టల్ సిబ్బందికి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం ఒక్కరోజే పలు విద్యాసంస్థల్లో 29మంది విద్యార్థులు, నలుగురు సిబ్బందికి పాజిటివ్ వచ్చింది.
అప్రమత్తమైన వైద్యశాఖ..
కరోనా వ్యాధి నేపథ్యంలో మేడ్చల్ జిల్లా వైద్య శాఖ అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా ఏరియా దవాఖాన, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానల్లో కరోనా పరీక్షల సంఖ్యను పెంచారు. ప్రతి రోజూ మూడు వేల మందికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి మల్లికార్జునరావు తెలిపారు. కరోనా పరీక్షలలో పాజిటివ్ వచ్చిన వారికి అవసరమైన మందులను ఇచ్చి హోంఐసోలేషన్లో ఉండే విధంగా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఓయూలో ఇద్దరు విద్యార్థినులకు..
ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 19: ఉస్మానియా యూనివర్సిటీలో లేడీస్ హాస్టల్లోని గురువారం 150 మంది విద్యార్థినులకు కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరు విద్యార్థినులకు పాజిటివ్ వచ్చింది. దీంతో విద్యార్థినులు భయాందోళనలు చెందుతున్నారు.
మల్లేపల్లి ఐటీఐలో ముగ్గురికి..
సుల్తాన్బజార్,మార్చి 19: మల్లేపల్లి ఐటీఐలో ఒక అటెండర్కు, ఒక ఏటీవోతో పాటు ఎలక్ట్రానిక్ ట్రేడ్లో శిక్షణ పొందుతున్న విద్యార్థినికి శుక్రవారం కరోనా పాజిటివ్గా తేలింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వాతావరణ పరిస్థితులను కారణంగా చెప్పలేం. ఎందుకంటే గత సంవత్సరం కూడా వేసవిలోనే కేసులు ఉధృతమయ్యాయి.కరోనా నియమాలు పాటించకపోవడమే కేసులు పెరిగేందుకు ప్రధాన కారణం. గాంధీ ఐసీయూలోనే 70కేసులున్నాయి. ఏప్రిల్, మే నెలలో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. ప్రజలు కరోనా నియమాలు కచ్చితంగా పాటించాలి. అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దు. జనసమూహాలకు దూరంగా ఉండడం మంచిది. – డాక్టర్ రాజారావు,
సూపరింటెండెంట్, గాంధీ దవాఖాన
కరోనా వ్యాప్తి చెందకుండాచర్యలు తీసుకుంటున్నం
కరోనా లక్షణాలు ఉంటే తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించవద్దు. విద్యార్థులు కరోనా వ్యాధి బారిన పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. శానిటైజర్, మాస్కులు, భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థులకు సూచిస్తున్నాం. విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లి వస్తే సమాచారం ఇవ్వాలని తల్లిదండ్రులకు చెపుతున్నాం. లక్షణాలు ఉంటే వైద్యుల సూచనల మేరకు హోం ఐసోలేషన్లో ఉండాలని కోరుతున్నాం.-మేడ్చల్ జిల్లా డీఈవో విజయకుమారి