పోలీసుల విస్తృత ప్రచారం
మాస్కులు లేని వారికి అవగాహన
కరోనాపై ప్రత్యేక ప్రదర్శనలు
నిబంధనలు పాటించనివారిపై చర్యలు
ఉప్పల్, ఏప్రిల్ 6 : కరోనా కట్టడికి పోలీసులు విస్త్రృత ప్రచారం నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకుసాగుతున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ప్రజలను చైతన్యపరుస్తున్నారు. దీనితో ప్రజల్లో అవగాహన పెరుగుతుంది.
ఉప్పల్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే అంశంపై ప్రజలకు, వాహనదారులకు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. బయటకు వెళ్లినప్పుడు తప్పక మాస్కులు పెట్టుకోవాలని, భౌతికదూరం పాటించాలని, శానిటైజర్స్, సబ్బులతో చేతులు శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. ‘గంట గంటకు చేతులు కడగాలి.. వెంట ఎవరూ ఉండకుండా చూడాలని’ పాటను పాడుతూ ట్రాఫిక్ పోలీసులు ప్రదర్శన ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.
వస్తువులు ముట్టుకున్నా చేతులు శుభ్రం చేసుకోవాలని, మాస్కులు ధరించాలని తెలియజేస్తున్నారు. అదేవిధంగా ‘మాస్కులు లేకుంటే కరోనా మన వెంటపడుతుంది.., మాస్కులు ధరిస్తే కరోనా భయపడి పారిపోతుంది.. అని పోలీసులు ప్రదర్శన ద్వారా తెలియజేస్తూ ఆలోచింపచేస్తున్నారు.
కొవిడ్ నిబంధనలు పాటించనివారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద అవగాహన ర్యాలీలు, కార్యక్రమాలు చేపడుతూ వాహనదారులకు పలు సూచనలు చేస్తున్నారు. మాస్కులు ధరించనివారిని గుర్తించి జరిమానాలు విధిస్తున్నారు. మాస్కులు తప్పక ధరించాలని, మనం చేసే నిర్లక్ష్యం కుటుంబసభ్యులతోపాటుగా, సమాజానికి చేటు చేస్తుందని తెలియజేస్తున్నారు. ప్లకార్డులు, ప్లెక్సీలతో ప్రదర్శన చేపట్టి, అవగాహన కల్పిస్తున్నారు.