హైదరాబాద్ : ఉత్తర కేరళ నుంచి ఇంటీరియర్ కర్ణాటక, మరాఠ్వాడ మీదుగా నైరుతి మధ్యప్రదేశ్ వరకు ఏర్పడిన ఉపరితలద్రోణి బలహీనపడింది. ఇంటీయర్ ఒడిశా పరిసర ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితలద్రోణి ఏర్పడింది. దక్షిణ తమిళనాడు నుంచి ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ కొంకణ్వరకు మరో ఉపరితలద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. బుధవారం గంటకు 30– 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వివరించారు.
శనివారం ఉదయం వరకు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు ఎండల తీవ్రత స్వల్పంగా తగ్గింది. ఇదిలా ఉండగా సోమవారం హైదరాబాద్ సహా 14 జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. పలుచోట్ల వడగండ్లు పడగా, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. దీంతో ధాన్యం తడువగా, మామిడికాయలు రాలిపోయాయి. మధ్యాహ్నం వరకు ఎండ దంచి కొట్టగా, ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. మబ్బులు కమ్మి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. మెదక్ జిల్లాలో పిడుకుపాటుకు ఒకరు మృతి చెందారు.