మల్కాజిగిరి, ఏప్రిల్ 25 : కరోనా పరీక్షలు, టీకాలు ఒకేచోట నిర్వహించడం మంచిది కాదని, టెస్ట్లను దూరంగా నిర్వహించాలని మేడ్చల్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్వేతా మహంతి ఆదేశించారు. ఆదివారం మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని అధికారులతో సందర్శించి కరోనా పరీక్షలు, టీకాలపై ఆమె డీఎంహెచ్వో మల్లికార్జునరావు, సూపరింటెండెంట్ డాక్టర్ రాజును అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని నాలుగు అంతస్థులు కలియతిరిగిన ఇన్చార్జి కలెక్టర్ కరోనా రోగుల వార్డును పరిశీలించారు.
వార్డులో ఎంతమంది ఉన్నారని ప్రశ్నించగా, 9 మంది చికిత్స పొందుతున్నారని, ఒక బెడ్ ఖాళీగా ఉందని వివరించారు. అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, తహసీల్దార్ వినయలత, కార్పొరేటర్ శ్రావణ్కుమార్, వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి ఏరియా ఆస్పత్రిలో పరీక్షల సంఖ్య మరింత పెంచాలని, పరీక్షలు, వ్యాక్సిన్ ఒకేచోట కాకుండా టెస్టింగ్ సెంటర్ను వేరే ప్రాంతానికి తరలించాలని కార్పొరేటర్ శ్రావణ్కుమార్ ఇన్చార్జి కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు.
హఫీజ్పేట, ఏప్రిల్ 25 : అది మదీనగూడలోని అతిపెద్ద మైహోం జువెల్స్ గేటెడ్ కమ్యూనిటీ సముదాయం. రెండు వేలకుపైగా ఫ్లాట్లు. సుమారు 8వేలకు పైచిలుకు జనాభా. ఇంతమంది ఉన్నచోట కరోనా కలకలం. భయపడుతున్నలోపే పదుల సంఖ్యలో కేసులు వెలుగుచూడడంతో మైహోం జువెల్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అప్రమత్తమైంది. జీహెచ్ఎంసీ, వైద్యఆరోగ్యశాఖ సహకారంతో వెంటనే పరీక్షలు చేయించింది. కొవిడ్ సోకిన వారికి జాగ్రత్తలు సూచించి హోం ఐసోలేషన్లో ఉంచారు. వీరి అవసరాలు తీర్చేందుకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. పరీక్షల అనంతరం రెండురోజులపాటు అర్హులైన 400 మందికి టీకాలు కూడా వేయించింది.
వేలాదిమంది నివాసం ఉండే అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీలో వైద్యఆరోగ్యశాఖ, జీహెచ్ఎంసీ, పోలీసుశాఖతోపాటు కమ్యూనిటీలోని ప్రతిఒక్కరి సంపూర్ణ సహకారంతో కొవిడ్ వ్యాప్తిని వారంరోజుల్లోపు పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చినం. ప్రధానంగా ప్రభుత్వం తరఫున ప్రత్యేక సహాయ సహకారాలు అందించిన వైద్య,ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్కు అసోసియేషన్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. – మురళీధర్రావు, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు