మేడ్చల్ కలెక్టరేట్, మార్చి 26: ప్రభుత్వ పథకాలు అర్హులైన పేదలకు అందేలా చూడాలని మేడ్చల్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్వేతా మహంతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ప్రభుత్వ పథకాలపై రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, ఈ విషయంలో అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. అర్హులై ఉన్నప్పటికీ, ఎవరికైనా సంక్షేమ ఫలాలు అందనట్లయితే జాబితా తయారు చేయాలని సూచించారు. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు అందనట్లయితే అవసరమైన చర్యలు తీసుకోవాలని, వారికి వాటిని అందజేసే బాధ్యత తీసుకోవాలన్నారు. అర్హులైన ఇళ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలని, పారదర్శకత పాటించి అర్హులకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను కలెక్టర్ అదేశించారు. ఆర్డీఓలు తహసీల్దార్లకు సూచనలు ఇవ్వాలని సూచించారు. సమావేశంలో ఆర్డీఓలు మల్లయ్య, రవి, తహసీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు.