మేడ్చల్, ఆగస్టు30(నమస్తే తెలంగాణ): జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ హరీశ్ సోమవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్కు వివరించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ హరీశ్, సీపీ మహేశ్ భగవత్, అదనపు కలెక్టర్ శ్యాంసన్, డీసీపీ రక్షిత కృష్ణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు పేర్కొన్నారు. ప్రమాద ప్రాంతాలు ఉన్న చోట ప్రజలను అప్రమత్తం చేయనున్నట్లు తెలిపారు.
సిద్దిపేట జిల్లా మల్లారంలోని నీటిశుద్ధి కేంద్రంలో భారీ వర్షం కారణంగా పంపింగ్ నిలిపి వేశామని, నీటి శుద్ధి కేంద్రం ప్రహరీ కూలి పంప్హౌస్లోకి వరదనీరు వచ్చి చేరిందని, తొలగించే పనులను ప్రారంభించినట్లు సీఎస్కు కలెక్టర్ హరీశ్ వివరించారు.
పునరుద్ధరణకు మూడురోజుల సమయం పడుతుందని, దీని వల్ల మేడ్చల్ నియోజకవర్గంలో మూడురోజుల పాటు మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరా యం ఏర్పడిందని పేర్కొన్నారు. మేడ్చల్ నియోజవర్గంలోని మున్సిపాలిటీ కమిషనర్లు, మున్సిపల్ చైర్మన్లు, సర్పంచులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించినట్లు వెల్లడించారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి మల్లికార్జునరావు, సీపీఓ మోహన్రావు పాల్గొన్నారు.