తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన జోనల్ విధానాన్ని కేంద్రం ఆమోదించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషి ఫలించిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మంత్రి క్యాంప్ కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి ఆయన క్షీరాభిషేకం చేశారు. అనంతరం, మల్లారెడ్డి మాట్లాడుతూ జోనల్ వ్యవస్థ మీద విశేష పరిజ్ఞానం ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన జోనల్ విధానాన్ని తీసుకురావాలని సంకల్పించారని కొనియాడారు. కేంద్రం వద్ద ఏడు జోన్ల విధానాన్ని ఆమోదించుకునే విధంగా రెండేళ్లు పోరాటం చేశారని తెలిపారు. ఇక నుంచి 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే లభిస్తాయని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. క్షీరాభిషేకం కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.