చెరువుల చుట్టూ బండ్ , వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు
సమీక్షా సమావేశంలో మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి
బడంగ్పేట,మే 3 : చెరువుల సుందరీకరణ పనులు వేగవంతంచేయాలని విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం బడంగ్పేట మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, కమిషనర్ కృష్ణమోహన్రెడ్డి తో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని చెరువులను సుందరీకరణకు తీసుకోవల్సిన చర్యలపై ఆమె చర్చించారు. చెరువుల సుందరీకరణకు ప్రభుత్వం కోట్ల రూపాయలను కేటాయించిందని పేర్కొన్నారు. అల్మాస్గూడలోని కోమటి కుంట అభివృద్ధికి రెండు కోట్లు, పోచమ్మ కుంటకు, బాలాపూర్ పెద్ద చెరువుకు కోటి రూపాయల చొప్పున మంజూరు చేశామన్నారు.
చెరువుల చుట్టూ బండ్ ఏర్పాటు చేయించాలని అధికారులకు సూచించారు. వాకింగ్ ట్రాక్లను త్వరగా చేపట్టాలన్నారు. స్థానికులు సేద తీరడానికి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా తీర్చిదిద్దాలన్నారు. కార్పొరేషన్ పరిధిలో ఉన్న అన్ని చెరువులను దశలవారీగా సుందరీకరణ చేయిస్తామన్నారు. చెరువుల చుట్టూ పార్కులు, సెటిల్ కోర్టులు, యోగా కేంద్రాలు, చిల్డ్రన్ పార్కులు ఏర్పాటు చేయబోతున్నామన్నారు. చెరువుల్లో డ్రైనేజీ నీరు కలువకుండా ప్రత్యేక డ్రైనేజీ పైపులైన్ వేయనున్నట్లు వెల్లడించారు.