మెదక్, జనవరి 19 : పెండింగ్ కేసులను త్వరితగతంగా పరిష్కరించాలని మెదక్ ఎస్పీ రోహిణిప్రియదర్శిని సిబ్బందిని ఆదేశించారు. బుధవారం మెదక్ జిల్లా కేంద్రం ఏఆర్హెడ్ క్వార్టర్స్లో నెల వారి నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి, వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బ్లూకోల్ట్స్, ఒక పెట్రో కార్ నిరంతరాయంగా తిరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రాపర్టీ నేరాలు జరిగితే స్పెషల్ టీమ్స్ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేసి సొమ్మును బాధితులకు అందించే విధంగా కృషి చేయాలన్నారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్పై అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీస్ స్టేషన్లో కరోనా నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వహించాలని ఆదేశించారు. మహిళలు, పిల్లల రక్షణ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని, పోలీసు అధికారులు మహిళా శిశు రక్షణకు అన్ని చర్యలు చేపట్టాలని తెలిపారు. మహిళలు తాము ఎదుర్కొన్న సమస్యలపై పోలీస్స్టేషన్లో దరఖాస్తు చేసుకుంటే వెంటనే స్పం దించి బాధితురాలికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించారు. మహిళలపై జరుగుతున్న నేరాలపై సత్వరమే స్పందించి కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేయాలని తెలిపారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో పూర్తి సాక్ష్యాలతో దర్యాప్తును చేసి నేరస్తులకు శిక్షలు పడే విధంగా చూడాలన్నారు. జిల్లాలో అన్ని గ్రామాలు, పట్టణాల నుంచి వైర్లెస్ సీసీ కెమెరాలను ఆయా పోలీస్స్టేషన్లకు అనుసంధానం చేసేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్షా సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ డాక్టర్ బాలస్వామి, మెదక్ డీఎస్పీ సైదు లు, డీసీఆర్బీ సీఐ సునీల్, జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.