ఘట్కేసర్ రూరల్, ఏప్రిల్ 1 : ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని నేరాల నియంత్రణకు పోలీసులు పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిరోజు నేరాలు, ప్రమాదాలు, దొంగతనాలు పెరిగి పోతున్నాయి. క్షణాల్లో దొంగతనాలు, దోపీడీలు, మర్డర్లు, చైన్ స్నాచింగ్లు, ప్రమాదాలు పెరుగుతుండటంతో నేరాల అదుపునకు పోలీసులకు సీసీ కెమెరాలు ఎంతో తోడ్పాటును అందిస్తున్నాయి. అందులో భాగంగానే అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఘట్కేసర్ మండల కేంద్రంతో పాటు అయా గ్రామాల్లో పోలీసులు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, షాపులు, గ్రామాల సర్పంచ్లు, ప్రజాప్రతినిధులకు సీసీలపై అవగాహన కల్పిస్తున్నారు.
సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు అదుపు కావడంతో నేనుసైతం కార్యక్రమంలో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామాలు, కాలనీల ప్రజలు ముందుకు వస్తున్నారు. ఘట్కేసర్ పోలీసుస్టేషన్ పరిధిలో మొత్తం 1000 సీసీ కెమెరాల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటికే 596 సీసీలు ఏర్పాటు చేయగా మరో 125 కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు.
సీసీల ఆధారంగా ఘట్కేసర్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఘట్కేసర్ మున్సిపాలిటీ బాలాజీనగర్, ఎన్ఎఫ్సీనగర్, పోచారం, చౌదరిగూడ, ఓయూ కాలనీ, కొర్రెములతో పాటు పలు చోట్ల జరిగిన 17 దొంగతనం కేసులను చేధించి దొంగలను పట్టుకున్నారు. రాత్రి వేళలో సైతం సులువుగా నేరస్థులను గుర్తించేలా 2 ఎంపీ మోటరైజ్డ్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కెమెరాల ద్వారా వాహనాల నంబర్లతో పాటు నేరస్థులను సునాయాసంగా గుర్తించేందుకు వీలు ఉంటుంది. ఘట్కేసర్ మండలంలో ప్రజల భాగస్వామ్యంతో నేర రహిత సమాజాన్ని నిర్మించేందుకు సీసీ కెమెరాలు ముఖ్య భూమిక పోషిస్తున్నాయి.