శామీర్పేట, జనవరి 10 : జీవితంలో రెండు దానాలు గొప్పవి.. ఒకటి అన్నదానం.. రెండోది రక్తదానం. మొదటిది కడుపునింపితే.. రెండోది సాటి మనిషి ప్రాణాలు నిలుపుతుంది. ఉరుకులు పరుగుల జీవితంలో కొందరు కొంత సమయాన్ని సామాజిక కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారు. తమకు తోచిన సాయం చేస్తూ.. పేదలకు కొండంత అండగా ఉంటున్నారు. ఆ కోవకే చెందిన కొందరు యువకులు ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించి.. అత్యవసర సమయాల్లో రక్తదానం చేసి.. ఆపద్బంధవులవుతున్నారు. అంతేకాదు బ్లడ్ డొనేషన్ ప్రాముఖ్యతను వివరిస్తూ..ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు.
దేవరయాంజాల్కు చెందిన బీటెక్ సాయిగౌడ్ సమాజానికి ఏదైనా చేయాలని సంకల్పించాడు. అనుకున్నదే తడవుగా.. తన స్నేహితులు వెంకటేశ్, దుర్గం నర్సింగ్గౌడ్, పి.రాజశేఖర్, ప్రవీణ్, కర్ణాకర్రెడ్డి, వెంకటేశ్, నరేందర్ తో కలిసి లైఫ్ సేవర్ ఆర్గనైజేషన్ సంస్థను ఏర్పాటు చేశాడు. దీనిద్వారా ప్రముఖల జన్మదిన వేడుకలు, ప్రత్యేకరోజుల్లో రక్తదానం చేస్తూ.. మానవత్వాన్ని చాటుకుంటున్నారు ఈ సంస్థ సభ్యులు. ఇప్పటివరకు 700 యూనిట్ల రక్తం సేకరించి..ఎందరో ప్రాణాలు నిలిపారు. ఎక్కడైనా రక్తం అవసరం పడితే.. అక్కడికి వెళ్లి రక్తదానం చేస్తున్నారు.
గ్రామంలోనే లైఫ్ సేవర్ ఆర్గనైజేషన్ ద్వారా 20 శిబిరాలు నిర్వహించారు. తలసీమియా, ప్రమాదంలో గాయపడి ప్రాణాపాయం ఉన్నవారు, గర్భిణులకు రక్తం అవసరం ఉందంటే చాలు వెంటనే వెళ్లి రక్తదానం చేస్తుంటారు. నిరుపేదలకు సేవలు అందించడమే లక్ష్యంగా గాంధీ, నిమ్స్, ఉస్మానియా వంటి ప్రభుత్వాస్పత్రులతో పాటు సాయివాణి, చిరంజీవి బ్లెడ్బ్యాంక్ వంటి ప్రైవేటు సంస్థలు, ఆస్పత్రులకు రక్తాన్ని సేకరించి ఇచ్చారు. కొవిడ్-19 వైరస్ కారణంగా లాక్డౌన్లో ప్రజల కోసం ఐపీఎం నారాయణగూడకు రక్తదానం చేశారు. కరోనా సమయంలో 5 నెలల్లోనే 40 మంది గర్భిణులు, రోడ్డు ప్రమాదంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారి కోసం రక్తదానం చేశారు.
ప్రాణాపాయ పరిస్థితుల్లో సాటి మనిషి ప్రాణాలను కాపాడేందుకు రక్తదానం ఎంతో ముఖ్యమైన్నది.సేవ చేయాలని వచ్చిన మాకు మా గ్రామస్తులు, పెద్దలు అండగా ఉంటూ.. భుజం తట్టారు. 2011 నాటి నుంచి నేటికి రక్తదాన శిబిరాలు నిర్వహించి.. ప్రభుత్వ ఆస్పత్రులకు, స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వడమే కాకుండా ఎక్కడ ఎవరికీ రక్తం అవసరమున్నా.. సమయానికి అక్కడికి వెళ్లి ఉచితంగా రక్తదానం చేస్తున్నాం. 9848296069 కాల్ చేస్తే.. సేవలో మేముంటాం. -నేమూరి సాయికిరణ్గౌడ్ (బీటెక్ సాయి)