శామీర్పేట, జూలై 27 : నిరుపయోగంగా ఉన్న బీసీ వసతి గృహాలను ఉపయోగంలోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ కార్యదర్శి బుర్ర వెంకటేశ్వర్లు తెలిపారు. మేడ్చల్ జిల్లాలోని శామీర్పేట, మూడుచింతలపల్లి, మేడ్చల్ మండలాల్లోని బీసీ వసతి గృహాలను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ వసతి గృహాల కోసం నిర్మించిన హాస్టళ్లు ప్రస్తుతం విద్యార్థుల లేని కారణంగా నిరుపయోగంగా ఉన్నాయని తెలిపారు.
వాటిని ప్రజావసరాల కోసం అందుబాటులోకి తీసుకురావాలని వచ్చిన వినతుల మేరకు అభివృద్ధి చేసే దిశగా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ఈ భవనాల్లో సంచార జాతుల విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసి స్కిల్స్ డెవలప్మెంట్ శిక్షణ ఇస్తామని చెప్పారు. అందులో భాగంగానే స్థలాలను పరిశీలించామని పేర్కొన్నారు. త్వరలోనే సంచార జాతుల విజ్ఞాన కేంద్రంగా స్కిల్స్ డెవలప్మెంట్తో అభివృద్ధిలోకి తీసుకువస్తామన్నారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అదనపు డైరెక్టర్ అలోక్కుమార్, స్టడీ సర్కిల్ డైరెక్టర్ బాలాచారి, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఝాన్సీరాణి, ఎంపీటీసీ సగ్గు శ్రీనివాస్యాదవ్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి జగదీశ్గౌడ్, తదితరులు పాల్గొన్నారు.