మేడ్చల్ : మేడ్చల్ జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపల్పై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. సూరారంలో శనివారం రాత్రి ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూరారంలో హరిప్రసాద్ అనే వ్యక్తి భవ్యసాయి పాఠశాల ప్రిన్సిపల్గా కొనసాగుతున్నాడు. శనివారం రాత్రి పదిన్నర సమయంలో పాఠశాలకు వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తి అతడిని అడ్డగించి కత్తితో మొహం, మెడ, ఛాతీపై పొడిచాడు. స్థానికులు కేకలు వేయడంతో దుండగుడు ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన హరిప్రసాద్ను స్థానికులు చికిత్స నిమిత్తం హుటాహుటిన దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. హత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.