మేడ్చల్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభమైంది. మేడ్చల్ జిల్లా హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్లో శుక్రవారం ప్రారంభమైన ఈ ర్యాలీలో పాల్గొనేందుకు తెలంగాణలోని 33 జిల్లాల నుంచి 62 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. 24 వరకు కొనసాగనున్న ఈ ర్యాలీలో ప్రతిరోజు నాలుగు వేల మంది పాల్గొనేలా ఆర్మీ అధికారులు అడ్మిట్ కార్డులు అందజేశారు. అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన అనంతరం రిక్రూట్మెంట్కు సంబంధించిన పరీక్షలను నిర్వహించనున్నారు.
ఆర్మీ రిక్రూట్మెంట్లో పాల్గొనే అభ్యర్థులకు మేడ్చల్ జిల్లా వైద్యాధికారులు థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. అనంతరం ర్యాలీకి అనుమతిస్తున్నారు. అంతేకాక మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడంతో పాటు అంబులెన్స్ను అందుబాటులో ఉంచారు.
ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేడ్చల్ జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 24 గంటల పాటు విద్యుత్ సరఫరా, మంచినీటి సౌకర్యాన్ని కల్పించారు. ఎప్పటికప్పుడు శానిటేషన్ పనులు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను మేడ్చల్ జిల్లా ఆదనపు కలెక్టర్ విద్యాసాగర్, డీఆర్వో లింగ్యానాయక్ పర్యవేక్షిస్తున్నారు.