కేపీహెచ్బీ కాలనీ : బాటసారులు, ఆకలితో అలమటించే పేదల కడుపునింపాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్నపూర్ణ క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. నగరంలో ప్రధాన చౌరస్తాలు, రోడ్ల పక్కన ఏర్పాటు చేసిన అన్నపూర్ణ క్యాంటీన్లలో రోజూ మధ్యాహ్నం వేలాది మంది ఆకలి తీర్చుకుంటున్నారు. రోడ్డుపై, చౌరస్తాలలో నిలబడి భోజనం చేయడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అన్నపూర్ణ క్యాంటీన్ల వద్ద తాగడానికి నీళ్లు లేక.. చేతులు కడుక్కోవడానికి వసతులు లేకపోవడం.. రోడ్లపైనే నిలబడాల్సి రావడంతో కొందరు ఆకలి ఉన్నా అక్కడ భోజనం చేయడానికి వెనుకంజ వేస్తున్నారు. వర్షం కురిసిందంటే చాలు అన్నపూర్ణ క్యాంటీన్లన్నీ జనాలు లేక వెలవెలబోతున్నాయి. ఈ సమస్యపై మంత్రి కేటీఆర్, అధికారులతో చర్చించి అన్నపూర్ణ క్యాంటీన్లకు అనుబంధంగా భోజనశాలలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమత చొరవతో నగరంలోనే తొలిసారిగా కూకట్పల్లి జోన్ కార్యాలయం ఎదుట అత్యాధునిక వసతులతో అన్నపూర్ణ క్యాంటీన్ను తీర్చిదిద్దుతున్నారు.
సర్కిల్కు ఒకటి చొప్పున…
కూకట్పల్లి జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో… సర్కిల్కు ఒకటి చొప్పున అన్నపూర్ణ భోజనశాల (డైనింగ్ హాల్)ను అందుబాటులోకి తెస్తున్నారు. భోజనశాలనిర్మాణానికి రూ.37.5 లక్షల నిధులను కేటాయించారు. దీనిలో భాగంగా మూసాపేటలోని కూకట్పల్లి జోన్ కార్యాలయం ఎదుట అన్నపూర్ణ క్యాంటీన్ పక్కన రూ.7.5 లక్షలతో చేపట్టిన అన్నపూర్ణ భోజనశాల పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ భోజనశాలను ప్రైవేట్ భోజనశాలలకుధీటుగా సకల వసతులను ఏర్పాటు చేస్తున్నారు. భోజనశాలలో కూర్చుని అన్నం తినేలా టేబుళ్లు, కుర్చీలతో పాటు గాలి , వెలుతురు వచ్చేలా ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లను అమరుస్తున్నారు. అన్నం తిన్న తర్వాత చేతులు కడుక్కునేందుకు ప్రత్యేకంగా వాష్బేసిన్ను ఏర్పాటు చేశారు. అలాగే అన్నంతిన్న ప్రజలందరికీ తాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఆకలి తీర్చడమే కాకుండా సంతృప్తిగా భోజనం చేశామన్న అనుభూతిని కల్పించేలా ఏర్పాట్లు చేశారు.
త్వరలోనే ప్రారంభం: వి.మమత, జడ్సీ
మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు అన్నపూర్ణ క్యాంటీన్లకు అనుబంధంగా భోజనశాలలను ఏర్పాటు చేస్తున్నాం. మొదటి విడతలో సర్కిల్కు ఒకటి చొప్పున ఐదు ప్రాంతాల్లో భోజనశాలలు నిర్మిస్తున్నాం. మూసాపేటలో నిర్మించిన అన్నపూర్ణ భోజనశాల పనులు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం. మిగిలిన ప్రాంతాల్లో త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి. అన్నపూర్ణ క్యాంటీన్ల వద్ద ప్రజలందరూ సంతృప్తిగా భోజనం చేసేలా వసతులను కల్పిస్తున్నాం.