మేడ్చల్, ఆగస్టు16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 50 వేల లోపు వ్యవసాయ రుణమాఫీ నగదు సోమవారం రైతుల ఖాతాల్లో నేరుగా జమ అయ్యాయి. దశలవారీగా రైతుల రుణమాఫీ నగదు వారి ఖాతాల్లోనే జమ కానున్నది. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా రూ. 50 వేల రుణ మాఫీ జాబితాలో 2,020 మంది లబ్ధిదారులు ఉన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం రూ. 6 కోట్ల 99 లక్షలు మంజూరు చేసింది. దీంతో రైతు రుణ మాఫీ ప్రారంభమైంది. మొదటి విడత రూ. 25 వేల రుణమాఫీలో జిల్లా వ్యాప్తంగా 1339 మంది రైతులు లబ్ధి పొందిన విషయం విధితమే. రెండో విడతలో.. రూ.50 వేల లోపు రుణాలు తీసుకున్న రైతుల ఖాతాల్లో నగదు జమతో రైతులు రుణ విముక్తులయ్యారు. రుణమాఫీ అయిన రైతులు కొత్తగా పంట రుణాలు పొందే అవకాశం ఉంది.
దశలవారీగా వ్యవసాయ రుణమాఫీ
రూ. 50 వేల వ్యవసాయ రుణ మాఫీ దశలవారీగా కొనసాగుతున్నది. రైతుల ఖాతాల్లో నేరుగా రుణ మాఫీ నగదు జమ కానున్నది. ఈ నెలాఖరులోపు రుణమాఫీ పూర్తి చేయనున్నారు. రుణాలు ఉన్న రైతులందరికీ రుణమాఫీ వర్తిస్తుంది. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. -మేరీ రేఖ, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా వ్యవసాయాధికారి