కుత్బుల్లాపూర్,ఆగస్టు17: ప్రజలకు మెరుగైన జీవన విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. దీనిలో భాగంగానే కాలనీల్లో ప్రభుత్వ స్థలాలు, పార్కులు, ఇతర మైదానాలు హరితహారం కార్యక్రమాలతో విరివిరిగా మొక్కలు నాటుతున్నారు. మరో పక్క పార్కులను పంచతత్వ పార్కులుగా తీర్చిదిద్దుతున్నారు. వీటిలో ఆయుర్వేద మొక్కలు ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ సన్నాహాలు చేస్తున్నది. పేట్ బషీరాబాద్లోని గంగా వెల్ఫేర్ అసోసియేషన్ పరిధిలో ఉన్న పార్కును పంచతత్వ పార్కుగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. రూ.12 లక్షల వ్యయంతో అధునాతనమైన హంగులతో తీర్చిదిద్దుతున్నారు.
పంచతత్వ పార్కును మోడ్రన్గా తీర్చిదిద్దుతున్నారు. పార్కు మధ్యలో ఆయుర్వేద మొక్కలు నాటేందుకు వాటిని ప్రత్యేకంగా బెంగళూరు నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. పాత్ వే, గ్రీనరీ బ్యూటిఫికేషన్తో పార్కును సుందరీకరణగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే పార్కులో పాత్వే, మొక్కలు, ఆయుర్వేద మొక్కల ఏర్పాటు కోసం నిర్మాణాలు చేసి సిద్ధంగా ఉంచారు.
పార్కులో ప్రజల సౌకర్యార్థం కోసం అనేక రకాలైన మొక్కలు, ఆయుర్వేద మొక్కలతో పాటు మౌలిక వసతుల కల్పన కోసం ప్రత్యేక నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మరో నెల రోజుల్లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తగు చర్యలు తీసుకుంటున్నాం. – మురళీమోహన్, హార్టికల్చర్ విభాగం అధికారి, కుత్బుల్లాపూర్