మేడ్చల్, సెప్టెంబర్ 22: మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో హృదయవిదారకర ఘటన చోటుచేసుకుంది. భర్త కండ్లముందే ప్రమాదవశాత్తు లారీ కిందపడి భార్య మృతిచెందింది. నగరంలో నివాసముంటున్న మెదక్ జిల్లా, వెల్దుర్తి మండలం, మానేపల్లి గ్రామానికి రాజమల్లె శ్రీనివాస్, మంజుల(41) దంపతులు ఆదివారం సొంతూరుకు వెళ్లి.. బుధవారం తిరుగు ప్రయాణమయ్యారు. మేడ్చల్ చెక్పోస్టు జంక్షన్ వద్ద 44వ జాతీయ రహదారిపై వీరి ద్విచక్రవాహనం అదుపు తప్పింది. అదే సమయంలో శామీర్పేట వైపు మళ్లుతున్న లారీ వెనుక చక్రాల కింద మంజుల పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కనురెప్పపాటులో ఏం జరిగిందో తేరుకునే లోపే భార్య విగతజీవిగా మారడంతో శ్రీనివాస్ గుండెలవిసేలా రోదించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు..మృతదేహాన్ని మేడ్చల్లోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రవీణ్రెడ్డి తెలిపారు.