శామీర్పేట, సెప్టెంబర్ 18 : మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి రాంగ్ రూట్లో తీసుకెళ్తున్న ఆటో డ్రైవర్తో గొడవపడ్డాడు. ఒక్కసారిగా ఆటో నుంచి దూకేయగా, మరో వాహనం ఢీకొట్టి చనిపోయాడు. శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు… నాగోల్కు చెందిన నాంపల్లి సాయిచరణ్(26) తన స్నేహితులతో కలిసి(మొత్తం ఎనిమిది మంది) శామీర్పేట కట్టమైసమ్మ దేవాలయానికి వచ్చాడు. స్నేహితులతో కలిసి మద్యం తాగాడు. అక్కడ చిన్న గొడవ జరుగడంతో సాయికిరణ్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఆటో బుక్ చేసుకుని తిరుగు ప్రయాణమయ్యాడు. రాజీవ్ రహదారిపై రాంగ్ రూట్లో వెళ్తుండగా, అలా ఎందుకు వెళ్తున్నావంటూ.. డ్రైవర్తో గొడవపడిన సాయిచరణ్.. ఒక్కసారిగా శామీర్పేట బస్టాప్ సమీపంలో ఆటో నుంచి దూకేశాడు. అదే సమయంలో శామీర్పేట నుంచి అలియాబాద్ వైపు వస్తున్న ట్రాక్టర్ చక్రాల కిందపడి మృత్యువాత పడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి పేట్బషీర్బాగ్ ఏసీపీ రామలింగరాజు, సీఐ సుధీర్కుమార్, ట్రాఫిక్ సీఐ రాజశేఖర్రెడ్డి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.